సంస్థాన్ నారాయణపురం, వెలుగు : గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటునందించాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ‘మన ఊరు.. మన అభివృద్ధి’ పేరిట ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా గ్రామస్తులంతా కలిసికట్టుగా కృషి చేస్తే ప్రతి ఊరు సస్యశ్యామలంగా మారుతుందని, గ్రామంలో పుట్టి పెరిగిన వారు ఇలా అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. నారాయణపురం పంచాయతీ అభివృద్ధి కోసం సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, మాజీ ఎంపీపీ గుప్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
