- సోదాల టైంలో హైబీపీ రావడంతో ఆస్పత్రిలో చేర్చామంటున్న ఏసీబీ అధికారులు
- మరోవైపు రెండో రోజూ కొనసాగిన తనిఖీలు.. బినామీల లావాదేవీలపై ఆరా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్పై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇలాంటి ప్రతి కేసులోనూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఏసీబీ.. భీమ్రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్పై సస్పెన్స్ కొనసాగుతున్నది. గతంలో ఇలాంటి ప్రతి కేసులోనూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన ఏసీబీ.. భీమ్రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అధికారి కావడం, రాజకీయ ఒత్తిళ్ల వల్లే భీమ్రెడ్డిని అరెస్ట్ చేయడం లేదనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు.
గురువారం మధ్యాహ్నం ఏసీబీ సోదాల సమయంలో హైబీపీ కారణంగా భీమ్రెడ్డి అస్వస్థతకు గురయ్యారని, దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు భీమ్రెడ్డిని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని, డిశ్చార్జ్ అనంతరం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
జీపీఆర్ సొసైటీ వ్యవహారంలో గిఫ్ట్గా ఓపెన్ ప్లాట్లు
భీమ్రెడ్డి నివాసంతో పాటు బినామీల ఇండ్లలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పటాన్ చెరులో డీఎస్పీగా ఉన్న సమయంలో జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వెంచర్కి సంబంధించిన పలు కేసులను భీమ్రెడ్డి పరిష్కరించినట్లు గుర్తించారు. జీపీఆర్ హౌసింగ్ సొసైటీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించినందుకుగాను అదే వెంచర్లో రెండు ఓపెన్ ప్లాట్లు భీమ్రెడ్డి పేరిట రిజిస్టర్ చేసినట్లు ఆధారాలు సేకరించారు.
ఈ క్రమంలోనే మణికొండ ల్యాంకో హిల్స్లోని జనచైతన్యనగర్లో 2008లో రూ.55 లక్షలకు కమర్షియల్ బిట్ కొనుగోలు చేసినట్లు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీటికి మొదట్లో సేల్ డీడ్ కింద ఆ తర్వాత 2011లో క్యాన్సిలేషన్ డీడ్ కింద రిజిస్టర్ చేయించుకున్నట్లు గుర్తించారు.
బినామీల లావాదేవీలపై ఆరా
మరోవైపు భీమ్రెడ్డి బినామీలపై ఏసీబీ కూపీ లాగుతోంది. ఆయా వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, ఆ స్థోమత ఉందా? లేదా? అనే వివరాలను సేకరిస్తోంది. కాగా, తనపై ఏసీబీ దాడులు జరుగుతాయని భీమ్రెడ్డికి మొదటి నుంచే తెలుసునని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే చాలా ఆస్తులను బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఆస్తుల కొనుగోలు సమయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పలు ఆస్తులకు సంబంధించిన సేల్ డీడ్స్ను క్యాన్సిలేషన్ డీడ్స్గా మార్చినట్లు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. మణికొండలో ఇలాంటి క్యాన్సిలేషన్ డీడ్ ఉన్న జీ+5 కమర్షియల్ బిల్డింగులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
