మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞాన్ కాలేజ్ సమీపంలో ఆరుగురు యువకులను అతివేగంగా వచ్చిన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందరికీ కాళ్లు, చేతులు విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
క్షతగాత్రులందరినీ వెంటనే మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు .
