హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలాశయమైన నాగార్జున సాగర్కు వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం నుంచి నీటిని వదులుతుండడంతో సాగర్లోకి వరద పోటెత్తుతోంది. దీంతో వాటర్బోర్డుకు కష్టాలు తప్పాయి.
వర్షాలు పడక సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, వర్షాలు సరిగ్గా కురవక రెండు వారాల క్రితం 513 అడుగులకు చేరుకుంది. 510 అడుగులకు చేరుకుంటే పంపింగ్చేసి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు బోర్డు కూడా సిద్ధమైంది.
అయితే, కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతుండడం, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో సాగర్ లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం 532 అడుగులకు చేరింది. అలాగే కొద్ది రోజుల కింద 136 టీఎంసీల నీళ్లుండగా ఇప్పుడు 176.05 టీఎంసీలకు చేరుకుంది. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉండడంతో పంపింగ్బాధ తప్పినట్టయ్యింది.
‘సాగర్’ నుంచి లోటు భర్తీ
కృష్ణా ప్రాజెక్టు 3 దశల ద్వారా నగరానికి రోజుకు 270 ఎంజీడీలను సరఫరా చేస్తున్నారు. అలాగే, సింగూరు రిపేర్ల నేపథ్యంలో 29 టీఎంసీల కెపాసిటీ ఉన్నా కూడా 4.181 టీఎంసీలు మాత్రమే మెయింటెయిన్చేస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి రోజుకు 69 ఎంజీడీలు డ్రా చేసే అవకాశమున్నా కొంత తగ్గించారు.
ప్రస్తుతం ఉన్న నిల్వలు 4 నెలలకు సరిపోయే అవకాశం ఉండడంతో, ఆ తర్వాత జీరో లెవెల్గానే కొనసాగించి రిపేర్లు చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏర్పడే లోటును కృష్ణా ప్రాజెక్టు నుంచి 25 ఎంజీడీలు అదనంగా తీసుకోవడం ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారు.
