సైబర్ దాడులకు పాల్పడిన ఉగ్రమూకల ఏరివేతలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దూకుడు పెంచింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో భాగంగా... దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో NIA ఏకకాలంలో సంచలన సోదాలు నిర్వహించింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
ముఖ్యంగా తెలంగాణలోని రామగుండంలో అనుమానితుల నివాసాల్లో NIA అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ డివైసులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్లతో పాటు పలు పెన్డ్రైవ్లను సీజ్ చేశారు. సైబర్ దాడులకు పాల్పడిన వ్యక్తుల సాంకేతిక విశ్లేషణ ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్' సమయంలో దేశంలోని 54 కీలక ప్రభుత్వ వెబ్సైట్లపై 'డీడీఓఎస్ దాడులకు యత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ కీలక కంప్యూటర్ వనరులు, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ సైబర్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. మొదట గుజరాత్ ATS నమోదు చేసిన ఈ కేసును, ఆ తర్వాత తీవ్రత దృష్ట్యా NIA తన చేతుల్లోకి తీసుకుంది. 2025 జూన్ 25న RC-01/2025/NIA/AMD నంబర్తో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ సైబర్ టెర్రరిజం నెట్వర్క్లో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా... తాజాగా సోదాలు జరిపిన అనుమానితులకు వారితో ఉన్న సంబంధాలపై NIA అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
