- బతుకుదెరువు కోసం హనుమకొండకు వచ్చిన సురేందర్
- ఉదయం ర్యాపిడో బైక్ డ్రైవింగ్.. సాయంత్రం డెలివరీ డ్యూటీ
- కారు డ్రైవర్ ఓవర్స్పీడే ప్రమాదానికి కారణం
కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట ఎన్ఐటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కారు ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్ చనిపోయాడు. మృతుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలపురానికి చెందిన గోపగాని సురేందర్ గా గుర్తించారు. కాజీపేట పోలీసుల కథనం ప్రకారం... సురేందర్ బతుకుదెరువు కోసం భార్య సృజన, ఆరేండ్లలోపు ఇద్దరు పిల్లలతో కొంతకాలం కింద హనుమకొండలోని భీమారం వచ్చి ఉంటున్నాడు. ఉదయం ర్యాపిడో బైక్నడుపుతూ..సాయంత్రం స్వీగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బైక్పై నిట్ ఎస్బీఐ ఏటీఎం వద్ద యూటర్న్ తీసుకొని ఫాతిమానగర్ వైపు వెళ్తుండగా హనుమకొండ నుంచి ఫాతిమానగర్ వైపు అతి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు, పోలీసుల సాయంతో వరంగల్ ఎంజీఎం తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కారు నడిపిన హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన దేవులపల్లి కార్తికేయను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.