పెండింగ్ పరిహారం ఇవ్వాలని.. ములుగు తహసీల్దార్ ఆఫీసుకు తాళం

పెండింగ్ పరిహారం ఇవ్వాలని.. ములుగు తహసీల్దార్ ఆఫీసుకు తాళం
  • కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఆందోళన 

ములుగు, వెలుగు: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు తహసీల్దారు ఆఫీసుకు తాళం వేసి ధర్నా చేశారు. ఉద్యోగులు, అధికారులు లోపలికి వెళ్లకుండా బైఠాయించారు. పరిహారం రాకపోవడంతో ఆర్అండ్ఆర్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న అనిల్ కుటుంబ సభ్యులతో పాటు నిర్వాసితులు గురువారం చేపట్టిన ధర్నాకు బీజెపీ నేతలు మద్దతు పలికారు.

కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంతో భూమి కోల్పోయి ఆర్అండ్ ఆర్ కాలనీ  ఉంటున్న ములుగు మండలం మామిడియాలకు చెందిన దాచారం అనిల్ గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. ఏండ్లు గడుస్తున్నా పెండింగ్ పరిహారం అందకపోవడంతో కుటుంబసభ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయమై తెలుసుకున్న తహసీల్దార్ ఆరిఫా.. మృతుడి కుటుంబంతో పాటు నిర్వాసితులతో మాట్లాడి సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విరమించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కొనసాగించారు.