‘నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి’ అధికారుల‌కు కేటీఆర్ సూచ‌న‌

‘నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి’ అధికారుల‌కు కేటీఆర్ సూచ‌న‌

రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ అధికారులను సూచించారు. మంగ‌ళ‌వారం మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ, మేయర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ఆరోగ్య శాఖ సెక్రెటరీ శాంతికుమారి, మెడికల్, పోలీస్ మరియు జీ హెచ్ ఎం సి జోనల్ అధికారులతో కరోనా నివారణ చర్యలపై సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందని, కరోనా వ్యాప్తి నివారణ చేయాలంటే ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం ఒకటే మార్గమని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో 100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, పూర్తిగా అన్ని రహదారులను మూసివేసి ఒకటే మార్గం పోలీసుల పహరలో తెరచి ఉంచాలని అన్నారు. ఏ ఒక్కరు బ‌య‌టికి రావొద్దని, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని, సభలు, సమావేశాలు అటువంటి సామూహిక పంపిణీ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో చేపట్టరాదని తెలిపారు. ఎవరైనా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అనుకుంటే పోలీస్ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకుని, అనుమానితులను హాస్పిటల్ కు తరలించి కావలసిన వైద్య పరీక్షలు చేయించాల‌న్నారు. ఎవ‌రికైనా పాజిటివ్ రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించి , వారి ట్రావెల్ హిస్టరీ వివరాలతో పాటు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి తదుపరి చర్యలు తీసుకోవాలని, పోలీస్, జిహెచ్ఎంసి మరియు మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఈటెల అన్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీస్, మెడికల్ మరియు మున్సిపల్ అధికారులతో, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్పటికప్పుడు డే అండ్ నైట్ పర్యవేక్షణ చేస్తున్నారని, అనుమానితుల‌ను క్వారంటీన్ చేయడం, లేదా హాస్పిటల్స్ కు పంపడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా, ఎవరికైనా అనుమానితులు లేదా వైద్య సేవలు కావాలంటే 104 లేదా జీహెచ్ఎంసి లోని 040 21111111 నెంబర్ కి కాల్ చేసి వైద్య లేదా ఇతర అత్యవసర సర్వీస్ ల కోసం కాల్ చేయొచ్చని ఆయన అన్నారు.

సమావేశంలో సీపీలు అంజనికుమార్, సజ్జనార్ మరియు మహేష్ భగవత్, డైరెక్టర్ మెడికల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.