డ్రామాలు ఆడేందుకే ఢిల్లీకి పోతున్నరు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

డ్రామాలు ఆడేందుకే ఢిల్లీకి పోతున్నరు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
  • రిజర్వేషన్లపై కేంద్రంపై నెపం మోపేందుకు సర్కారు కుట్ర

హైదరాబాద్​, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీకి వెళ్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ డ్రామాలు ఆడేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. బీసీ బిల్లును హడావుడిగా పాస్​ చేసి కేంద్రానికి పంపారని, ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి  తలసాని శ్రీనివాస్​యాదవ్​ మీడియాతో మాట్లాడారు. కులగణనను ప్రభుత్వం శాస్త్రీయంగా చేయలేదని అన్నారు. 8న కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీ రిజర్వేషన్లపై భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్పారు.  రాహుల్​గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్​ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లోనూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి డిమాండ్​ చేశారు. 

బీసీలను మోసం చేయడం కాంగ్రెస్​ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ అన్నారు. బీసీలకు సీఎం పదవి చేపట్టే అవకాశం వచ్చినా కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు.  బీసీలను ప్రభుత్వం అణగదొక్కుతుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్​ అన్నారు.  బీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండలి డిప్యూటీ చైర్మన్​ బండా ప్రకాశ్​ అన్నారు.