టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళుతోంది తమన్నా. ఓ వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్, గ్లామరస్ రోల్స్తో ఆకట్టుకుంటోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్తోనూ మెప్పిస్తోంది తమన్నా. తాజాగా క్రేజీ సీక్వెల్కు ఓకే చెప్పింది. దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సీక్వెల్లో తమన్నా లీడ్ రోల్ చేస్తోంది. ‘ఓదెల 2’ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీ శుక్రవారం కాశీలో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ను కూడా స్టార్ట్ చేసినట్టు తెలియజేశారు. సంపత్ నంది క్రియేటర్గా ఉన్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై డి.మధు నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ కంటే.. ‘ఓదెల 2’ మరింత రూటెడ్ థ్రిల్లింగ్గా ఉండబోతుందని, సీక్వెల్ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలు ఉంటాయని మేకర్స్ తెలియజేశారు. ఇటీవల ఓటీటీలో వరుస సూపర్ హిట్స్తో పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ అందుకుంది తమన్నా. దీంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్స్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు.