
- అసెంబ్లీ క్యాంటీన్ మూసివేస్తూ ఆదేశాలు
- మంత్రులు,ఎమ్మెల్యేలు ఇళ్ల నుంచే భోజనాలు తెచ్చుకోవాలి: సీఎం స్టాలిన్
చెన్నై: అధికారం చేపట్టింది మొదలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సొంత రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వృధా ఖర్చులు, దుబారా ఖర్చులతోపాటు విలువైన సమయాన్ని వృధా చేసే అవకాశం ఉన్న విధానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేసే రీతిలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలోని క్యాంటీన్ ను మూసివేయాలని ఆదేశించారు. అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి భోజనాలను ఇళ్ల నుండే తెచ్చుకోవాలని సూచించారు.
తనకు ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ అన్నా డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్న ఆయన తన కాన్వాయ్ వల్ల ప్రజల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని భావించి కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను బాగా తగ్గించుకున్న విషయం తెలిసిందే. తనను పొగుడుతూ ఎవరూ మాట్లాడొద్దని.. మరీ ముఖ్యంగా అసెంబ్లీలో సమస్యలు, ప్రజాహిత కార్యక్రమాల గురించే మాట్లాడాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదేశించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పొగడ్తలకు దూరంగా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్న సీఎం స్టాలిన్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.