5 ఏళ్లలో 30 వేల మంది ప్రెషర్స్కి ఉద్యోగాలు
రెవెన్యూ అంచనాలు మిస్
రూ.5 చొప్పున డివిడెండ్ ప్రకటన
మనదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.8,126 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 లాభం కేవలం 0.4 శాతం పెరిగి రూ.8,131 కోట్లకు చేరింది. గత క్యూ1తో పోలిస్తే ఈ క్యూ1లో లాభం 10.8 శాతం పెరిగింది. రెవెన్యూలు 11.4 శాతం పెరిగాయి. ఆపరేటింగ్ మార్జిన్ 24.2 శాతం నమోదయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆపరేషన్ల రెవెన్యూ 0.42 శాతం పెరిగి రూ.38,172 కోట్లకు చేరింది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూవృద్ధిరేటు 10.6 శాతం నమోదయింది. లైఫ్ లైన్సెస్ అండ్ హెల్త్కేర్ ప్యాక్ 18.1 శాతం పెరిగింది.
బీఎఫ్ఎస్ వెర్టికల్ 9.2 శాతం, రిటైల్ అండ్ ఈపీజీ వెర్టికల్ 7.9 శాతం, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా వెర్టికల్ 8.4 శాతం, టెక్నాలజీ సర్వీసెస్ వెర్టికల్ 7.8 శాతం, మాన్యుఫ్యాక్చరింగ్ వెర్టికల్ 5.5 శాతం పెరుగుదల సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే ఇంగ్లండ్ అత్యధికంగా 16 శాతం ఎదుగుదల నమోదు చేసింది. ఇండియా 15.9 శాతం, యూరప్ 15 శాతం, నార్త్ అమెరికా 7.7 శాతం, ఆసియా పసిఫిక్ 9.5 శాతం, మిడిల్ ఈస్ట్ ఆసియా 6.4 శాతం, లాటిన్ అమెరికా మార్కెట్ 6.4 శాతం వృద్ధి సాధించాయి. కొత్త విభాగాల్లోకి విస్తరణ, డిజిటల్ సేవలు, బిజినెస్ 4.0 ఫ్రేమ్వర్క్ వల్ల కస్టమర్లకు మరింత దగ్గరయ్యామని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణపతి సుబ్రమణియం అన్నారు. ప్రతి షేరుకు రూ.ఐదు చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఐదేళ్లలో 30 వేల మందికి ఉద్యోగాలు
ప్రస్తుత క్వార్టర్లో ఇచ్చిన 12,356 ఉద్యోగాలను కలుపుకొని గత ఐదేళ్లలో 30 వేల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పించామని టీసీఎస్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఒక క్వార్టర్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఈ ఐదేళ్లలో ఇదే మొదటిసారని తెలిపింది. వీరిలో 40 శాతం మంది మొదటి క్వార్టర్లోనే జాయిన్ అయ్యారని, మిగతా వాళ్లు రెండో క్వార్టర్లో చేరుతారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 4.36 లక్షలకు చేరింది. మహిళా ఉద్యోగుల సంఖ్య 36.1 శాతం కాగా, టీసీఎస్లో మొత్తం 149 దేశాల/జాతుల ఉద్యోగులు ఉన్నారు. ఆర్గానిక్ ట్యాలెంట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. కొత్త టెక్నాలజీలపై ఈ క్వార్టర్లో 3.15 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, 3.61 లక్షల మందికి ఏజైల్ మెథడ్స్ నేర్పించామని తెలిపింది. ఇదిలా ఉంటే, ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు రూ.55 నష్టంతో (2.55 శాతం) రూ.2,120 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేరు 12.79 శాతం పెరిగింది.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే లాభం 10 శాతం పెరిగింది. మా ఆర్డర్ బుక్ పటిష్టం గా ఉంది. ఈ క్వార్టర్ లో కొత్తగా ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నాం . అన్ని దేశాల్లో కంపెనీ పనితీరు అద్భుతంగా ఉంది. –రాజేశ్ గోపీనాథన్,
టీసీఎస్ సీఈఓ, ఎండీ