ఖమ్మం టౌన్, వెలుగు: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్న ఓ టీచర్ను బాధిత పేరెంట్స్ స్కూల్ నుంచి బయటికి లాక్కొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సిటీలోని ఖాజీపురా ప్రభుత్వ హైస్కూల్లో ఎండి.ఆర్షద్ పాషా గత కొన్ని నెలలుగా స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
శనివారం 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్కు చెప్పింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకుని ల్యాబ్లో ఉన్న టీచర్ను బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. దెబ్బలు తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పరుగు తీసి పోలీస్ వాహనంలోకి ఎక్కాడు.
అనంతరం ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అతడిని స్టేషన్కు తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్టేషన్కు వెళ్లి టీచర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన డీఈవో చైతన్య జైని, ఎంఈఓ శైలాజ లక్ష్మి స్కూల్లో విచారణ చేశారు. హెచ్ఎం నారాయణ విద్యార్థినుల వాంగ్మూలాలను లిఖితపూర్వకంగా నమోదు చేశారు.
డిజిటల్ క్లాస్ల పేరుతో గది తలుపులు మూసి భుజాలపై చేతులు వేయడం, నడుము పట్టుకోవడం, వెనుక బెంచ్లో కూర్చున్న విద్యార్థినులను అనుచితంగా తాకడం వంటి చర్యలకు టీచర్ పాల్పడినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. ఈ ఘటనలో తమతో రాజీకి రావాలని టీచర్ బంధువులు బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులను ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆర్షద్ పాషాను సస్పెండ్ చేస్తూ డీఈవో చైతన్య జైని ఉత్తర్వులు జారీ చేశారు.
