- పీఆర్సీ రిపోర్ట్ బయటపెట్టి మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలి: మల్క కొమరయ్య డిమాండ్
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న 5 డీఏలను క్లియర్ చేస్తారని రాష్ట్రంలోని టీచర్లు, ఉద్యోగులకు ఆశగా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నదని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. సర్కారు తీరుతో ఉద్యోగులంతా నిరాశలో మునిగిపోయారని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డీఏల ఊసే ఎత్తకపోవడం, ముఖ్యంగా పీఆర్సీ మంజూరుపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలన్నింటినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన డీఏ వాస్తవానికి గత నెలలోనే ఇవ్వాల్సి ఉందని, అంతకుముందు గత ఏడాది జులైలోనే ఇస్తామని చెప్పారని ఎమ్మెల్సీ గుర్తుచేశారు. ఇప్పుడు ఒక డీఏ ఇచ్చినా, రేపో మాపో కేంద్రం కొత్త డీఏ ప్రకటిస్తుందని, దీంతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా ఇస్తామనడం మంచిదే అయినా.. ఏండ్ల తరబడి పెండింగ్లోని టీచర్ల మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను వెంటనే చెల్లించాలని మల్క కొమరయ్య కోరారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈహెచ్ఎస్ విధివిధానాలపై సీఎం మౌనం వీడాలన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే బయటపెట్టి, గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫిట్మెంట్తో రెండో వేతన సవరణను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
