
- స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లలో వెంటాడుతున్న టీచర్ల కొరత
- జిల్లాలో జీరో స్ట్రెంత్ స్కూల్స్పై అధికారుల స్పెషల్ ఫోకస్
నాగర్ కర్నూల్, వెలుగు:నాగర్కర్నూల్ జిల్లాలోని పలు స్కూళ్లకు సబ్జెక్ట్ ప్యాట్రన్ పేరుతో 100 మంది టీచర్లను డిప్యూటేషన్ వేయడంతో, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో టీచర్ల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండాలన్న స్టాఫ్ ప్యాటర్న్, సబ్జెక్ట్ ప్యాట్రన్ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు టీచర్లు పైరవీలు చేసుకొని డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారు. టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు వర్క్ అడ్జస్ట్ కింద ఒక విద్యా సంవత్సరానికి మాత్రమే డిప్యూటేషన్ ఇవ్వాల్సి ఉండగా, విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు రెండేళ్లకు డిప్యూటేషన్లు ఇస్తూ గత ఏడాది మెమో జారీ చేశారు.
ఇక డిప్యూటేషన్ మీద వెళ్లిన టీచర్లు లాస్ట్ వర్కింగ్ డే రోజు ఒరిజినల్ పోస్టింగ్ ఉన్న స్కూల్లో రిపోర్ట్ చేయాల్సి ఉన్నా, స్కూల్ డైరెక్టరేట్ మెమోను అడ్డం పెట్టుకుని ఆ నిబంధనను పక్కన పెట్టారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 100 మంది టీచర్లు డిప్యూటేషన్లపై కొనసాగుతుండగా, మరోవైపు గత విద్యా సంవత్సరంలో జీరో స్ట్రెంత్ ఉన్న 61 స్కూళ్లను గుర్తించి వాటిని మూసేసి అక్కడి టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్ కింద వివిధ స్కూల్ కాంప్లెక్స్లకు అలాట్ చేశారు.
ఇలా టీచర్లు ఉన్న స్కూళ్లకు స్టూడెంట్స్ రాక, స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లలో టీచర్లు లేక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బడిబాట తర్వాత టీచర్ల లెక్కలు తేలుస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా, ఈ ఏడాది ఆగస్ట్ వరకు డిప్యూటేషన్ ఆర్డర్ తెచ్చుకున్న టీచర్లను అక్కడి నుంచి కదిలించే పరిస్థితి ఉండదని అంటున్నారు.
మూత బడిన 61 పాఠశాలలు..
మారుమూల ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లాలో 825 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, గిరిజన తాండాలు, పట్టణాల్లోని 61 ప్రభుత్వ తెలుగు మీడియం ప్రైమరీ స్కూళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. నాగర్కర్నూల్ మండలంలో 2, బిజినేపల్లి మండలంలో 4, తాడూరు మండలంలో1, తెల్కపల్లి మండలంలో 3, తిమ్మాజీపేటలో 2 స్కూల్స్ శాశ్వతంగా మూతబడ్డాయి. పెద్దకొత్తపల్లి మండలంలో 2, కోడేరు మండలంలో 4, కొల్లాపూర్ మండలంలో 3,పెంట్లవెల్లి మండలంలో 1, బల్మూరు మండలంలో 3, ఉప్పునుంతల మండలంలో 9, చారకొండ మండలంలో 4, అచ్చంపేట మండలం, పట్టణంలో 6, అమ్రాబాద్ 3, పదర మండలంలో 3, లింగాల మండలంలో 2 చొప్పున మూతబడ్డాయి.
కల్వకుర్తి పట్టణంలో 1, వెల్దండ మండలంలో 7, ఊర్కొండ మండలంలో 3 స్కూల్స్ క్లోజ్ చేశారు. మరో 107 గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 20 లోపే ఉన్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో ఉర్దూ మీడియం స్కూల్ రికార్డుల్లో మాత్రమే ఉంది. స్టూడెంట్స్ లేరనే కారణంతో స్కూళ్లను మూసేసిన విద్యాశాఖ అధికారులు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల తర్వాత హై స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల ఖాళీలను భర్తీ చేశారు.
అయినప్పటికీ కోడేరు, పెద్దకొత్తపల్లి, అమ్రాబాద్, పదర, లింగాల, తిమ్మాజీపేట, బిజినేపల్లి మండలాల్లోని పలు హైస్కూల్స్లో ఇప్పటికీ సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. ఈక్రమంలో మూతపడిన స్కూళ్లలో విద్యార్థులను చేర్పించి, వాటిని తెరిపించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆ మండలాలకు మస్తు డిమాండ్..
వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో కొందరు టీచర్లు డైరెక్ట్గా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో పైరవీలు చేసుకుని విద్యార్థులు లేని, హైవేల పక్కన ఉన్న స్కూళ్లకు డిప్యూటేషన్ ఆర్డర్లు పొందుతున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్ నుంచి బడులకు వచ్చిపోయే టీచర్లు మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
నిరుడు ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాల లీడర్ల ద్వారా పైరవీలు చేసుకొని నాగర్ కర్నూల్, తిమ్మాజీపేట, బిజినేపల్లి, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లోని హైవేలు, మెయిన్రోడ్ల పక్కన ఉండే బడులకు డిప్యూటేషన్లు వేయించుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఆ స్కూళ్లలోనే కంటిన్యూ అవుతున్నారు. వెల్డండ, పెద్దాపూర్జడ్పీ హైస్కూళ్లలో ట్రిబుల్ సబ్జెక్ట్ ప్యాట్రన్ పేరుతో టీచర్లను డిప్యూటేషన్పై అలాట్ చేశారు.
ఆగస్ట్ వరకు ఉత్తర్వులు ఉన్నాయ్..
జిల్లాలో 100 మంది టీచర్లు వర్క్ అడ్జస్ట్మెంట్, ఇతర కారణాలతో డిప్యూటేషన్పై ఉన్నారు. వీరిని ఈ విద్యా సంవత్సరం ఆగస్ట్ వరకు అక్కడే కొనసాగించాలని ఉత్తర్వులు ఉన్నాయి. బడిబాట తర్వాత విద్యార్థుల అడ్మిషన్లు, అవసరాలను బట్టి కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీచర్లను అడ్జస్ట్ చేస్తాం. - రమేశ్ కుమార్, డీఈవో