స్టూడెంట్స్ లేని స్కూళ్లకు.. టీచర్ల డిప్యూటేషన్లు రెండేళ్లకు ఆర్డర్స్ ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టరేట్ ఆఫీసర్లు

 స్టూడెంట్స్ లేని స్కూళ్లకు.. టీచర్ల డిప్యూటేషన్లు  రెండేళ్లకు ఆర్డర్స్ ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టరేట్ ఆఫీసర్లు
  • స్టూడెంట్స్​ ఉన్న స్కూళ్లలో వెంటాడుతున్న టీచర్ల కొరత 
  •  జిల్లాలో జీరో స్ట్రెంత్​ స్కూల్స్​పై అధికారుల స్పెషల్​ ఫోకస్​  ​

నాగర్ కర్నూల్, వెలుగు:నాగర్​కర్నూల్​ జిల్లాలోని పలు స్కూళ్లకు సబ్జెక్ట్​ ప్యాట్రన్​ పేరుతో 100 మంది టీచర్లను డిప్యూటేషన్​ వేయడంతో, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో టీచర్ల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండాలన్న స్టాఫ్​ ప్యాటర్న్, సబ్జెక్ట్​ ప్యాట్రన్​ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు టీచర్లు పైరవీలు చేసుకొని డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారు. టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు వర్క్​ అడ్జస్ట్​ కింద ఒక విద్యా సంవత్సరానికి మాత్రమే డిప్యూటేషన్​ ఇవ్వాల్సి ఉండగా, విద్యాశాఖ డైరెక్టరేట్​ అధికారులు రెండేళ్లకు డిప్యూటేషన్లు ఇస్తూ గత ఏడాది మెమో జారీ చేశారు.

 ఇక డిప్యూటేషన్​ మీద వెళ్లిన టీచర్లు లాస్ట్​ వర్కింగ్​ డే రోజు ఒరిజినల్​ పోస్టింగ్​ ఉన్న స్కూల్​లో రిపోర్ట్​ చేయాల్సి ఉన్నా, స్కూల్​ డైరెక్టరేట్​ మెమోను అడ్డం పెట్టుకుని ఆ నిబంధనను పక్కన పెట్టారు. నాగర్ కర్నూల్​ జిల్లాలో 100 మంది టీచర్లు డిప్యూటేషన్లపై కొనసాగుతుండగా, మరోవైపు గత విద్యా సంవత్సరంలో జీరో స్ట్రెంత్​ ఉన్న 61 స్కూళ్లను గుర్తించి వాటిని మూసేసి అక్కడి టీచర్లను వర్క్​ అడ్జస్ట్​మెంట్​ కింద వివిధ స్కూల్​ కాంప్లెక్స్​లకు అలాట్​ చేశారు. 

ఇలా టీచర్లు ఉన్న స్కూళ్లకు స్టూడెంట్స్​ రాక, స్టూడెంట్స్​ ఉన్న స్కూళ్లలో టీచర్లు లేక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బడిబాట తర్వాత టీచర్ల లెక్కలు తేలుస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా, ఈ ఏడాది ఆగస్ట్​ వరకు డిప్యూటేషన్​ ఆర్డర్​ తెచ్చుకున్న టీచర్లను అక్కడి నుంచి కదిలించే పరిస్థితి ఉండదని అంటున్నారు.

మూత బడిన 61 పాఠశాలలు..

మారుమూల ప్రాంతమైన నాగర్​కర్నూల్​ జిల్లాలో 825 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, గిరిజన తాండాలు, పట్టణాల్లోని 61 ప్రభుత్వ తెలుగు మీడియం ప్రైమరీ స్కూళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి.  నాగర్​కర్నూల్​ మండలంలో 2, బిజినేపల్లి మండలంలో 4, తాడూరు మండలంలో1, తెల్కపల్లి మండలంలో 3, తిమ్మాజీపేటలో 2 స్కూల్స్​ శాశ్వతంగా మూతబడ్డాయి. పెద్దకొత్తపల్లి మండలంలో 2, కోడేరు మండలంలో 4, కొల్లాపూర్​ మండలంలో 3,పెంట్లవెల్లి మండలంలో 1, బల్మూరు మండలంలో 3, ఉప్పునుంతల మండలంలో 9, చారకొండ మండలంలో 4, అచ్చంపేట మండలం, పట్టణంలో 6, అమ్రాబాద్ 3​, పదర  మండలంలో 3, లింగాల మండలంలో 2 చొప్పున మూతబడ్డాయి. 

కల్వకుర్తి పట్టణంలో 1, వెల్దండ మండలంలో 7,  ఊర్కొండ మండలంలో 3 స్కూల్స్​ క్లోజ్​ చేశారు.  మరో  107 గవర్నమెంట్​ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 20 లోపే ఉన్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో ఉర్దూ మీడియం స్కూల్  రికార్డుల్లో మాత్రమే ఉంది. స్టూడెంట్స్​ లేరనే కారణంతో స్కూళ్లను మూసేసిన విద్యాశాఖ అధికారులు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల తర్వాత హై స్కూళ్లలో సబ్జెక్ట్​ టీచర్ల ఖాళీలను భర్తీ చేశారు. 

అయినప్పటికీ కోడేరు, పెద్దకొత్తపల్లి, అమ్రాబాద్, పదర, లింగాల, తిమ్మాజీపేట, బిజినేపల్లి మండలాల్లోని పలు హైస్కూల్స్​లో ఇప్పటికీ సబ్జెక్ట్​ టీచర్ల కొరత ఉంది. ఈక్రమంలో మూతపడిన స్కూళ్లలో విద్యార్థులను చేర్పించి, వాటిని తెరిపించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ఆ మండలాలకు మస్తు  డిమాండ్..

వర్క్​ అడ్జస్ట్​మెంట్​ పేరుతో  కొందరు టీచర్లు  డైరెక్ట్​గా స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్​లో పైరవీలు చేసుకుని విద్యార్థులు లేని, హైవేల పక్కన ఉన్న స్కూళ్లకు డిప్యూటేషన్​ ఆర్డర్లు పొందుతున్నారు. హైదరాబాద్, మహబూబ్​నగర్​ నుంచి బడులకు వచ్చిపోయే టీచర్లు మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

నిరుడు ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాల లీడర్ల ద్వారా పైరవీలు చేసుకొని నాగర్​ కర్నూల్, తిమ్మాజీపేట, బిజినేపల్లి, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లోని హైవేలు, మెయిన్​రోడ్ల పక్కన ఉండే బడులకు డిప్యూటేషన్లు వేయించుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఆ స్కూళ్లలోనే కంటిన్యూ అవుతున్నారు. వెల్డండ, పెద్దాపూర్​జడ్పీ హైస్కూళ్లలో ట్రిబుల్​ సబ్జెక్ట్  ప్యాట్రన్  పేరుతో టీచర్లను డిప్యూటేషన్​పై అలాట్​ చేశారు.

ఆగస్ట్​ వరకు ఉత్తర్వులు ఉన్నాయ్..

జిల్లాలో 100 మంది టీచర్లు వర్క్​ అడ్జస్ట్​మెంట్,​ ఇతర కారణాలతో డిప్యూటేషన్​పై ఉన్నారు. వీరిని ఈ విద్యా సంవత్సరం ఆగస్ట్​ వరకు అక్కడే కొనసాగించాలని ఉత్తర్వులు ఉన్నాయి. బడిబాట తర్వాత  విద్యార్థుల అడ్మిషన్లు, అవసరాలను బట్టి కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీచర్లను అడ్జస్ట్​ చేస్తాం. - రమేశ్  కుమార్, డీఈవో