చెలరేగిన సఫారీ బౌలర్స్...పెవీలియన్కు క్యూ కట్టిన భారత బ్యాట్స్మన్

చెలరేగిన సఫారీ బౌలర్స్...పెవీలియన్కు క్యూ కట్టిన భారత బ్యాట్స్మన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. 23 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయిన భారత్..ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఈ టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపర్చాడు. ఎంగిడి బౌలింగ్లో మార్కరమ్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి మాంచి టచ్లో కనిపించిన విరాట్ కోహ్లీ సైతం..ఫుల్ షాట్ ఆడి..బౌండరీ లైన్ దగ్గర రబాడాకు చిక్కాడు. కోహ్లీ తర్వాత వచ్చిన దీపక్ హుడా ఎక్కువ సేపు క్రీజులో  నిలబడలేకపోయాడు. నోర్ట్జే బౌలింగ్ లో డికాక్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో టీమిండియా 42 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో సూర్యకుమార్కు హార్దిక్ పాండ్యా జతకలిశాడు. వీరిద్దరు జట్టును ఆదుకుంటారని అనుకున్నారు. కానీ ఎంగిడి మరోసారి దెబ్బ తీశాడు.  కోహ్లీ లాగే బంతిని ఆడబోయిన హార్దిక్..రబాడాకే చిక్కాడు. దీంతో  భారత్ ఖాతాలో 50 పరుగులు చేరకుండానే సగం వికెట్లు కోల్పోయింది. 

రాణించిన సూర్య...
కేఎల్ రాహుల్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్..జట్టును ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా...సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 40 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 15 పరుగులు, కోహ్లీ 12 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగతా వారు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి నాలుగు వికెట్లు పడగొట్టగా...పార్నెల్ 3 వికెట్లు తీసుకున్నాడు. నోర్ట్జేకు ఒక వికెట్ దక్కింది.