రాహుల్, సూర్య హాఫ్ సెంచరీలు..టీమిండియా భారీ స్కోరు

రాహుల్, సూర్య హాఫ్ సెంచరీలు..టీమిండియా భారీ స్కోరు

భారత బ్యాట్స్మన్ ధాటికి..గౌహతి గ్రౌండ్ దద్ధరిలింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో రాహుల్ రఫ్పాడిస్తే..సూర్య కుమార్ యాదవ్..చిచ్చరపిడుగులా చెలరేగడంతో...భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దుమ్మురేపారు. ప్రొటీస్ బౌలర్లను ఉతికారేశారు. తొలి వికెట్ కు 96 పరుగుల పాట్నర్ షిప్ను నమోదు చేశారు.

ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 28 బంతుల్లోనే  5  ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 37 బంతుల్లో  7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 43 రన్స్ కొట్టాడు. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చిన రోహిత్ శర్మను కేశవ్ మహరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత హాఅర్థ సెంచరీ చేసి జోరుమీదున్న రాహుల్ ను పెవీయన్ చేర్చాడు. 

సూర్య మెరుపు ఇన్నింగ్స్..
కేఎల్ రాహుల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంతిని ఎడా పెడా బాదాడు. సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇందులో 4 సిక్సులు, 5 ఫోర్లున్నాయి. హాఫ్ సెంచరీ అయ్యాక సూర్య జోరు మరింత కొనసాగింది. మొత్తంగా 22 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. అయితే సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు.  

కోహ్లీ కంటిన్యూ..
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్సర్ ఉంది. సూర్య ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్.. చివర్లో మెరుపులు మెరిపించాడు. 7 బంతుల్లోనే రెండు సిక్సులు, ఒక ఫోర్ తో 17 పరుగులు పిండుకున్నాడు. భారత బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడంతో..టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు సాధించాడు.