
వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్పై ఉత్కంఠ నెలకొంది. ఏ జట్టు ఏ జట్టుతో తలపడనుంది. ఏ టీమ్ ఏ గ్రూప్లో చోటు దక్కించుకోబోతుంది. ముఖ్యంగా టీమిండియా తన మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది..ఏ జట్టుతో ఆడనుందో తెలుసుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచులపై కీలక అప్ డేట్ వచ్చింది.
పాక్తో మ్యాచ్ ఎప్పుడు...
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచు చెన్నైలో జరిగే ఛాన్సుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక వరల్డ్ కప్ లో భాగంగా దాయాది పాక్ తో టీమిండియా తలపడబోతుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్కు కూడా చెన్నైలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరంభ మ్యాచులో...
వరల్డ్ కప్ ఆరంభ మ్యాచు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచులో 2019 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్తో తలపడనుంది. అక్టోబర్ 5వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. మెగా టోర్నీ ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్లోనే జరుగుతుంది. అయితే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ను బీసీసీఐ ఇంకా విడుదల చేయలేదు. ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేయనుంది.
12 వేదికల్లో..
వన్డే వరల్డ్ కప్ మొత్తం 12 వేదికలపై జరగనుంది. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గౌహతి, రాజ్కోట్, రాయ్పూర్, ముంబై స్టేడియాల్లో ఈ మ్యాచులు జరుగుతాయి. సెమీఫైనల్కు ముంబైలోని వాంఖడే ఆతిథ్యం ఇచ్చే ఛాన్సుంది. పాకిస్థాన్ తన మ్యాచులను అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఆడనుంది. ఈ మెగా ఈవెంట్ లో 48 మ్యాచులు జరగనున్నాయి.
వన్డే వరల్డ్ కప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికే 10 జట్లలో 8 జట్లు నిర్ధారించబడ్డాయి. 8 ఆటోమేటిక్ క్వాలిఫైయర్లు భారత్ (ఆతిథ్య), ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం జింబాబ్వేలో క్వాలిఫైయింగ్ టోర్నీ జరగనుంది. వెస్టిండీస్, శ్రీలంక, నేపాల్, యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఓమన్, స్కాంట్లాండ్ మధ్య ప్రపంచకప్ క్వాలిఫయర్స్ జరగనున్నాయి.