ముంబై: సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం నేడు ఇండియా జట్టును ఎంపిక చేయనున్నారు. ఐపీఎల్లో రాణిస్తున్న పేసర్లు ఉమ్రాన్ మాలిక్, మోసిన్ ఖాన్తో పాటు వెటరన్ ప్లేయర్లు శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్.. టీమ్లో ప్లేస్ కోసం ఎదురుచూస్తుండగా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రేస్లోకి వచ్చాడు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ పాండ్యా.. ప్రస్తుతం మెగా లీగ్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణిస్తున్నాడు.
కెప్టెన్ రోహిత్, విరాట్, బుమ్రా, పంత్కు విశ్రాంతి ఇస్తుండటంతో ఎక్కువ మంది యంగ్స్టర్స్కు చాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో సఫారీ సిరీస్తో పాటు ఐర్లాండ్తో రెండు మ్యాచ్లకు కూడా సేమ్ టీమ్ను కొనసాగించేలా సెలెక్షన్ ఉండనుంది. దీంతో హార్దిక్, ధవన్లో ఒకరికి కెప్టెన్గా చాన్స్ దక్కొచ్చు. టీమిండియాలో లెఫ్టార్మ్ పేసర్కు ఎక్కువ డిమాండ్ ఉండటంతో మోసిన్ ఖాన్కు కచ్చితంగా ప్లేస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పేస్, కచ్చితత్వంతో రాణిస్తున్న ఉమ్రాన్, అర్షదీప్ సింగ్ను కూడా పక్కనబెట్టే చాన్స్ లేదు. బ్యాటింగ్లో హైదరాబాదీ తిలక్ వర్మ, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్పై సెలెక్టర్లు దృష్టి పెట్టారు. అన్నింటికంటే ఆర్సీబీ తరఫున సూపర్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న దినేశ్ కార్తీక్ను తిరిగి టీ20 సెటప్లోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అక్టోబర్లో టీ20 వరల్డ్కప్ ఉన్న నేపథ్యంలో అతనికి మరో చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ తెవాటియా నుంచి డీకేకు పోటీ ఎదురుకావొచ్చు. స్పిన్నర్లలో చహల్, కుల్దీప్ జోడీ మళ్లీ రావొచ్చు. మొత్తానికి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.