హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను టీసీఎస్లో ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు.
భార్గవ్.. శనివారం(మార్చి 2) ఉదయం తన స్నేహితులతో కలిసి ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంకు క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. అయితే, మధ్యాహ్నం సమయంలో ఎండవేడికి అలసటగా అనిపించి ఆట మధ్యలోనే డగౌట్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కూర్చున్నచోటనే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్నేహితులు అతన్ని ముచ్చింతల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.