ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానంలో సాంకేతిక లోపం

ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానంలో సాంకేతిక లోపం
  • గంటన్నర గాలిలోనే చక్కర్లు! 
  • ఓపెన్ ​కాని హైడ్రాలిక్ వీల్స్
  • బేగంపేట్, హకీంపేటలో ల్యాండింగ్​కు నో పర్మిషన్​ 
  • అత్యవసరంగా ఆఫీసర్ల మీటింగ్​
  •    ఇంధనం అయిపోయే దాక గాల్లోనే ఉండాలని సూచన  
  • హాఫ్​వీల్​పై బేగంపేట్​లో సేఫ్​గా దింపిన పైలట్​
  • 14 మంది ట్రైనీ పైలట్లు సురక్షితం 

కంటోన్మెంట్, వెలుగు: ఎయిర్​ఫోర్స్​ శిక్షణ విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తడంతో గంటరన్నపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. చివరకు పైలట్​సమయస్ఫూర్తి, ఉన్నతాధికారుల సూచనలతో సేఫ్​గా ల్యాండ్​ అయ్యింది. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన శిక్షణ విమానం 14 మంది ట్రైనీ పైలట్లతో శుక్రవారం మధ్యాహ్నం ఎయిర్​ఫోర్స్​స్టేషన్​ నుంచి టేకాఫ్​అయ్యింది. 

అయితే, ల్యాండింగ్​అయ్యేప్పుడు హైడ్రాలిక్​ వీల్స్​ఓపెన్​కాలేదు.  దీన్ని గుర్తించిన పైలెట్ బేగంపేట ఎయిర్ బేస్​కు సమాచారం ఇచ్చాడు. అక్కడ ల్యాండింగ్​కు అనుకూలంగా లేదని చెప్పడంతో హకీంపేట ఎయిర్ బేస్​కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి కూడా అదే సమాధానం రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. పరిస్థితి సమీక్షించారు. హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకుండా ల్యాండింగ్ చేస్తే విమానం క్రాష్ అయ్యే అవకాశం ఉందని, అలా జరిగితే 14 మంది ట్రైనీ పైలట్ల ప్రాణాలకు ప్రమాదమని భావించారు. 

విమానంలోని ఇంధనం పూర్తయ్యేవరకు గాల్లోనే చక్కర్లు కొట్టాలని, ఎమర్జెన్సీ ల్యాండింగ్​కు అవసరమయ్యే ఇంధనం మాత్రమే ఉన్నప్పుడు ల్యాండ్ చేస్తే క్రాష్​అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచించారు. దీంతో దాదాపు గంటన్నర సేపు విమానం బేగంపేట విమానాశ్రయం పైనే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో విమానాన్ని బేగంపేటలో ల్యాండ్ చేయలా, లేక హకీం పేటలో ల్యాండ్ చేయాలా అనే దానిపై చర్చలు జరిపారు. 

చివరికి బేగంపేట అయితే సేఫ్ అని భావించి ల్యాండింగ్​కు సిద్ధమయ్యారు. ఒకవేళ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగితే రక్షించడానికి ఫైరింజన్, అంబులెన్స్ లు, ఎమర్జెన్సీ సిబ్బందితో సిద్ధంగా ఉన్నారు. అధికారుల సూచనల మేరకు పైలట్​విమానాన్ని హాఫ్ వీల్ మీదనే సేఫ్​గా ల్యాండ్​చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పైలట్​సమయస్పూర్తి, అధికారుల పక్కా ప్లానింగ్​తో 14 మంది సురక్షితంగా బయటపడ్డారు.