ఉద్యమకారులంతా ఏకం కావాలి: జిట్టా బాలకృష్ణారెడ్డి

ఉద్యమకారులంతా ఏకం కావాలి: జిట్టా బాలకృష్ణారెడ్డి

తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియలో ఉద్యమకారుల పునరేకీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్ర సాధన కోసం అందరం కలిస్తే తప్ప తెలంగాణ సాధ్యం కాదని అర్థమైనప్పుడు.. సిద్ధాంతాలు, భావ జాలాలు వేరైనా కవులు, కళాకారులతోపాటు రాజ కీయ పార్టీలు జేఏసీ గొడుగు కిందకు వచ్చి పనిచేశాయి. అది ఉద్యమం కాబట్టి జేఏసీ రూపంలో ఒక వేదికను పంచుకొని కొట్లాడితే సరిపోయింది. నేడు ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అయినప్పుడు, నియంతలా పరిపాలిస్తున్నప్పుడు, ఉద్యమ ఆకాంక్షలు గాలికి వదిలేసి కుటుంబ ఆకాంక్షలకు పెద్దపీట వేసినప్పుడు.. మరోసారి ఉద్యమకారులు నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు వేరు. నేటి పరిస్థితులు వేరు. బంగారు తెలంగాణ పేరుతో నియంత పోకడలను అవలంబిస్తున్నరు. 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నమో ఆ నౌకర్లు మన పిలగాండ్లకు రాకుండా ఒక కుటుంబంలోనే ఐదుగురు 5 సింహాసనాల మీద కూసోని రాజ్యమేలుతున్నరు. సంక్షేమ పథకాలకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను దూరం చేస్తూ తమాషా చూస్తున్నరు. 

పార్టీలు వేరైనా.. ఉద్యమకారుల్లా కొట్లాడుదాం.. 

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అందని ద్రాక్షలా తయా రైంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని అనుకున్నాం. కానీ కులం, కుటుంబం ఖాతాల్లోకి అధికారికంగా బదిలీ అయ్యే పరిస్థితి వస్తుందనుకోలేదు. ఈ తరం విద్యార్థులకు చదువు అందించే స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు పాడుబడిపోయాయి. ఉపాధి మార్గాలు లేవు. సామాజిక అభివృద్ధి లేదు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న తెలంగాణ మేడి పండు సామెతను గుర్తు చేస్తున్నది. ఈ పరిస్థితికి చరమగీతం పాడేదెలా? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించేదెలా? ఉద్యమకారులుగా కొట్లాడిన వాళ్లందరం వివిధ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నం. మనం మన పార్టీల ఎజెండాలో భాగంగా పనిచేస్తూనే, ఉద్యమకారులుగా ఏకం కావలసిన అవసరం ఉన్నది. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది.

అణచివేతలు.. ఆంక్షలు

అధికార, అర్థ బలాలతో తనకెవ్వరూ సాటి లేరని భావిస్తున్న కేసీఆర్ అహాన్ని దెబ్బ కొట్టాలంటే, రాష్ట్రంలో ఉద్యమకారులు గళ మెత్తాలి. ఆనాడు స్వరాష్ట్రం కోసం తెలంగాణ జాతర్లు చేసినం, సంబురాలు చేసినం. బోనాలు ఎత్తినం.. బతుకమ్మలాడినం.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పినం. రైలు రోకోలు, రాస్తారోకోలు, మిలి యన్ మార్చ్‌‌లు, సాగరహారాలు చేసినం. తెగ దింపుల సంగ్రామాలు, సభలు సమావేశాలు చేసి, పిల్లా జల్లా కార్మిక, కర్షక, ఉద్యోగ, మహిళా లోకాన్ని ఏకం చేసి, సకల జనుల సహకారంతో గల్లీలోనైనా, ఢిల్లీలో నైనా బరి గీసి కొట్లాడినం. పోరాటంలో రాజకీయ లబ్ధి కూడా పొందుతూ ఎదిగిన టీఆర్ఎస్.. తెలం గాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. మొదటి దఫాలో ఉద్యమ ఆకాంక్షల సాధనకు బదులు ఉద్యమకారుల అణచివేత.. మీడియా పై ఆంక్షలు.. ఎదురు తిరిగిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం అలవాటుగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక సంతలో పశువులను కొన్నట్టు పక్కపార్టీ ఎమ్మెల్యేలను, డబ్బులకు ఓట్లు కొనుక్కునే విష సంస్కృతి అమలు చేసే దాకా చేరింది.