కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం లభించింది. సభలో దీనిపై మూజువాణి ఓటింగ్ విధానం అనుసరించారు. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై  రాష్ట్రంలో  VRO వ్యవస్థ శాశ్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ప్రక్రియ కూడా జరుగనుంది. కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. తెలంగాణ ధరణి పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. బిల్లుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా అసెంబ్లీ ఆమోదం తెలపడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.