
రాష్ట్రంలో ప్రతి 10 వేల మందికి పది మందే హెల్త్ స్టాఫ్
దేశంలోనే చివరి నుంచి మూడోస్థానం
కేరళలో ప్రతి పది వేల మందికి 115,
ఏపీలో 95 మంది హెల్త్ స్టాఫ్.. నీతి ఆయోగ్ వెల్లడి
రాష్ట్రంలో స్టాఫ్ లేక ఆస్పత్రుల్లో అందని ట్రీట్మెంట్ ఉన్న సిబ్బంది పైనే పనిభారం
హైదరాబాద్, వెలుగు: జనాభాకు తగ్గట్లు డాక్టర్లు, నర్సులను నియమించుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిలైంది. కరోనా టైంలో కొన్ని రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన హెల్త్ స్టాఫ్ను నియమించుకోగా, తెలంగాణ మాత్రం వెనుకబడింది. దీంతో అనేక మందికి సరైన టైంలో ట్రీట్మెంట్ అందడం లేదు. పేషెంట్లతో హాస్పిటళ్లు నిండిపోతున్నా, చికిత్స అందించేందుకు సిబ్బంది సరిపోవడం లేదు. ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగిపోతోంది. రాష్ట్రంలో ప్రతి 10 వేల మందికి 10 మంది డాక్టర్లు, నర్సులు, మిడ్వైవ్స్ మాత్రమే ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.
రాష్ట్రంలో రిక్రూట్మెంట్కు దిక్కు లేదు
రాష్ట్రంలో టెంపరరీ పద్ధతిలో హెల్త్ స్టాఫ్ను రిక్రూట్ చేసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అదీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 2017లో స్టాఫ్ నర్సుల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే మొన్నటి వరకు రిజల్ట్ కూడా ఇవ్వలేదు. అందులోనూ ఇంకా 893 పోస్టులపై గందరగోళం కొనసాగుతోంది. ఇక తాత్కాలిక వైద్య సిబ్బంది, స్పెషలిస్టుల రిక్రూట్మెంట్ పరిస్థితీ అట్లనే ఉంది. శాలరీల విషయంలో సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుండటంతో జాయిన్ అయ్యేందుకు హెల్త్ స్టాఫ్ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పేషెంట్ దగ్గరికి ఉదయం డాక్టర్ వస్తే మళ్లీ మరుసటి రోజు ఉదయమే రౌండ్స్కు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఆస్పత్రుల్లో సరిపోయేంత స్టాఫ్ లేకపోవడమే.
ఇటీవల సస్టయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2020–21 పేరిట విడుదల చేసిన రిపోర్ట్లో ఈ అంశాలను ప్రస్తావించింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ మొదలవగానే కొన్ని రాష్ట్రాలు హెల్త్ స్టాఫ్ను స్పీడ్గా రిక్రూట్ చేసుకున్నాయి. ఇందులో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కేరళలో ప్రతి 10 వేల మందికి 115 మంది, ఆ తర్వాత ఏపీలో 95 మంది హెల్త్ స్టాఫ్ ఉన్నారు. హెల్త్ స్టాఫ్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి మూడో స్థానంలో తెలంగాణ ఉంది. దేశ సగటున చూస్తే ప్రతి పది వేల మందికి 37 మంది హెల్త్ స్టాఫ్ ఉన్నారు.
ఇన్సురెన్స్ ఉన్నా... జేబులో నుంచే సొమ్ము
హెల్త్ ఇన్సురెన్స్ ఉంటే దానికిందే హాస్పిటళ్లు చికిత్స అందించాలి. కరోనా టైంలో రాష్ట్రంలో చాలామంది కరోనా చికిత్స కోసం హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలు తీసుకున్నారు. అయినా హాస్పిటళ్లలో అది పనిచేయక జేబులో నుంచే ఖర్చు చేస్తున్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారం ఎక్కువ సంఖ్యలో హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నోళ్లలో తెలంగాణ మూడో ప్లేస్లో ఉంది. జేబులోంచి వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నోళ్లలోనూ మనమే ముందున్నాం. రాష్ట్రంలో 66.40 శాతం గృహాల్లో ఎవరో ఒకరికి హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నట్లు, ఆరోగ్యానికి ఒక్కో కుటుంబం నెలవారీగా 14.40 శాతం ఖర్చు పెడుతున్నట్లు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ట్రీట్మెంట్కు ఎటుంటి హెల్త్ స్కీమ్ను అమలు చేయట్లేదు. దీంతో జనం లక్షలకు లక్షలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
బరువు తక్కువ పిల్లలు 30.8%
రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది బరువు తక్కువగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. పిల్లలకు తల్లిపాలు, ప్రొటీన్లు, పౌష్టికాహారం అందకపోవడంతో బరువు తగ్గుతున్నారని పేర్కొంది. అలాగే పేదరికం కూడా ఇందుకు ఓ కారణమని తెలిపింది. రాష్ట్రంలో 49.8 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు నీతి ఆయోగ్ తన రిపోర్టులో పేర్కొంది.
యాక్సిడెంట్ మరణాల్లో రెండోస్థానం
రోడ్డు యాక్సిడెంట్ల వల్ల జరుగుతున్న మరణాల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. గోవా తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా యాక్సిడెంట్ డెత్స్ జరుగుతున్నాయి. రాష్ట్రంలో 18.68 శాతం మంది చనిపోతున్నారు.