హెల్త్​ కేర్​లో తెలంగాణ వెనుకబాటు

హెల్త్​ కేర్​లో తెలంగాణ వెనుకబాటు

రాష్ట్రంలో ప్రతి 10 వేల మందికి పది మందే హెల్త్​ స్టాఫ్
దేశంలోనే చివరి నుంచి మూడోస్థానం
కేరళలో ప్రతి పది వేల మందికి 115, 
ఏపీలో 95 మంది హెల్త్​ స్టాఫ్​.. నీతి ఆయోగ్​ వెల్లడి
రాష్ట్రంలో స్టాఫ్​ లేక ఆస్పత్రుల్లో అందని ట్రీట్​మెంట్​ ఉన్న సిబ్బంది పైనే పనిభారం

హైదరాబాద్​, వెలుగు: జనాభాకు తగ్గట్లు డాక్టర్లు, నర్సులను నియమించుకోవడంలో రాష్ట్ర సర్కార్​ ఫెయిలైంది. కరోనా టైంలో కొన్ని రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన హెల్త్​ స్టాఫ్​ను నియమించుకోగా, తెలంగాణ మాత్రం వెనుకబడింది. దీంతో అనేక మందికి సరైన టైంలో ట్రీట్మెంట్​ అందడం లేదు.  పేషెంట్లతో హాస్పిటళ్లు నిండిపోతున్నా, చికిత్స అందించేందుకు సిబ్బంది సరిపోవడం లేదు. ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగిపోతోంది. రాష్ట్రంలో ప్రతి 10 వేల మందికి 10 మంది డాక్టర్లు, నర్సులు, మిడ్​వైవ్స్​ మాత్రమే ఉన్నట్లు నీతి ఆయోగ్​ వెల్లడించింది.
రాష్ట్రంలో రిక్రూట్​మెంట్​కు దిక్కు లేదు
రాష్ట్రంలో టెంపరరీ పద్ధతిలో  హెల్త్​ స్టాఫ్​ను రిక్రూట్​ చేసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ  అదీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 2017లో స్టాఫ్​ నర్సుల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేస్తే మొన్నటి వరకు రిజల్ట్​ కూడా ఇవ్వలేదు. అందులోనూ ఇంకా 893 పోస్టులపై గందరగోళం కొనసాగుతోంది. ఇక తాత్కాలిక వైద్య సిబ్బంది, స్పెషలిస్టుల రిక్రూట్​మెంట్​ పరిస్థితీ అట్లనే ఉంది. శాలరీల విషయంలో సర్కార్​ మీనమేషాలు లెక్కిస్తుండటంతో జాయిన్​ అయ్యేందుకు హెల్త్​ స్టాఫ్​ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్​లో ఒక పేషెంట్​ దగ్గరికి ఉదయం డాక్టర్​ వస్తే మళ్లీ మరుసటి రోజు ఉదయమే రౌండ్స్​కు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఆస్పత్రుల్లో సరిపోయేంత స్టాఫ్​ లేకపోవడమే.

ఇటీవల సస్టయినబుల్​ డెవలప్​మెంట్ గోల్స్​ 2020–21 పేరిట విడుదల చేసిన రిపోర్ట్​లో ఈ అంశాలను ప్రస్తావించింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్​ ఫస్ట్​ వేవ్​ మొదలవగానే కొన్ని రాష్ట్రాలు హెల్త్​ స్టాఫ్​ను  స్పీడ్​గా రిక్రూట్​ చేసుకున్నాయి. ఇందులో కేరళ  ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. కేరళలో ప్రతి 10 వేల మందికి 115 మంది,  ఆ తర్వాత ఏపీలో 95 మంది హెల్త్​ స్టాఫ్​ ఉన్నారు. హెల్త్  స్టాఫ్​ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి మూడో స్థానంలో తెలంగాణ ఉంది. దేశ సగటున చూస్తే ప్రతి పది వేల మందికి 37 మంది హెల్త్​ స్టాఫ్​ ఉన్నారు. 
ఇన్సురెన్స్​ ఉన్నా... జేబులో నుంచే సొమ్ము
హెల్త్​ ఇన్సురెన్స్​ ఉంటే దానికిందే  హాస్పిటళ్లు  చికిత్స అందించాలి. కరోనా టైంలో రాష్ట్రంలో చాలామంది కరోనా చికిత్స కోసం  హెల్త్​ ఇన్సురెన్స్​ పాలసీలు  తీసుకున్నారు. అయినా హాస్పిటళ్లలో అది పనిచేయక జేబులో నుంచే ఖర్చు చేస్తున్నారు. నీతి ఆయోగ్​ రిపోర్ట్​లో పేర్కొన్న ప్రకారం ఎక్కువ సంఖ్యలో హెల్త్​ ఇన్సురెన్స్​ ఉన్నోళ్లలో తెలంగాణ మూడో ప్లేస్​లో ఉంది. జేబులోంచి  వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నోళ్లలోనూ మనమే ముందున్నాం. రాష్ట్రంలో 66.40 శాతం గృహాల్లో ఎవరో ఒకరికి హెల్త్​ ఇన్సురెన్స్​ ఉన్నట్లు, ఆరోగ్యానికి  ఒక్కో కుటుంబం నెలవారీగా 14.40 శాతం ఖర్చు పెడుతున్నట్లు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ట్రీట్​మెంట్​కు ఎటుంటి హెల్త్​ స్కీమ్​ను అమలు చేయట్లేదు. దీంతో జనం లక్షలకు లక్షలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 
బరువు తక్కువ పిల్లలు 30.8%
రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది బరువు తక్కువగా ఉన్నట్లు నీతి ఆయోగ్​ తెలిపింది. పిల్లలకు తల్లిపాలు, ప్రొటీన్లు, పౌష్టికాహారం అందకపోవడంతో బరువు తగ్గుతున్నారని పేర్కొంది. అలాగే పేదరికం కూడా ఇందుకు ఓ కారణమని తెలిపింది. రాష్ట్రంలో 49.8 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు నీతి ఆయోగ్​ తన రిపోర్టులో పేర్కొంది. 
యాక్సిడెంట్​ మరణాల్లో రెండోస్థానం
రోడ్డు యాక్సిడెంట్ల వల్ల జరుగుతున్న మరణాల్లో రాష్ట్రం  దేశంలోనే రెండో స్థానంలో ఉంది. గోవా తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా యాక్సిడెంట్​ డెత్స్​ జరుగుతున్నాయి. రాష్ట్రంలో 18.68 శాతం మంది చనిపోతున్నారు.