
- బనకచర్ల, రాయలసీమ ప్రాజెక్టులు, శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం
- కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని రాష్ట్ర నేతలు
- ఇద్దరు కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించట్లే..
- హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శలు
హైదరాబాద్, వెలుగు:కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు చేపడుతున్నా, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు వేగంగా కానిచ్చేస్తున్నా, కృష్ణాలో కోటాకు మించి నీటిని తన్నుకుపోతున్నా.. కమలం పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉన్నా.. బీజేపీ హైకమాండ్కు తెలంగాణ ప్రయోజనాల గురించి వివరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి మీటింగ్ నుంచి అర్ధంతరంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కేంద్రం తొలగించినా.. రాష్ట్ర బీజేపీ నుంచి స్పందన లేదు. ఏపీ కుట్రపూరితంగా ఆ అంశాన్ని ఎత్తేయించిందన్న ఆరోపణలపైనా మాట్లాడలేదు. ఏపీ కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్ర నీటి హక్కుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఒంటరిగానే పోరాడుతున్నది. అటు ఏపీ, ఇటు కేంద్రం తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది.
ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నది. ఇలాంటి టైమ్లో ఏపీ కుట్రలు, తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన బీజేపీ నేతలు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఏపీలో తమ మిత్రులను కాపాడుకునేందుకే బీజేపీ నేతలు మౌనంగా ఉంటూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడ్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు తెలంగాణకు తామే పెద్ద దిక్కు అని చెప్పుకునే బీఆర్ఎస్.. కేంద్రంతో పోరాడుతున్న కాంగ్రెస్కు సహకరించకుండా, ఉల్టా రివర్స్అటాక్చేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే నీటి వాటాల్లో నష్టం జరిగినా, ఏపీ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టినా.. తమ తప్పేమీ లేదన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. దీంతో ఈ రెండు పార్టీల వ్యవహార శైలిపై ఇటు రాజకీయ వర్గాలు, అటు ప్రజల్లో చర్చ జరుగుతున్నది.
బనకచర్లపై కిమ్మంటలే..
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు పెను నష్టం తప్పదని అధికారులు, నీటి పారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం కిమ్మనడం లేదు. మిగులు జలాల పేరు చెప్పి.. నికర జలాల దోపిడీకి స్కెచ్వేసిన ఏపీని అడ్డుకునేందుకు ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుండడమే ఇందుకు కారణం. రూ.81 వేల కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులు వచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం డీపీఆర్నూ సిద్ధం చేసేసిందన్న చర్చ కూడా నడుస్తున్నది.
త్వరలోనే కేంద్రానికి సమర్పించి అనుమతులు తెచ్చుకునేందుకూ సన్నద్ధమవుతున్నది. ఇటీవల ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఏపీ సీఎం చంద్రబాబు ప్రజంటేషన్కూడా ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రాజెక్టు కోసం తొలుత రూ.3 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని చెబుతున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్వద్ద ఈ ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్గానీ నోరెత్తలేదు. ప్రాజెక్టును చేపట్టొద్దంటూ కనీసం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన దాఖలాలూ లేవు.
ఏపీ బహిరంగంగానే ప్రాజెక్టును చేపడుతున్నా.. దోపిడీకి పాల్పడుతున్నా బీజేపీ నాయకులు కనీసం ప్రెస్మీట్పెట్టి విమర్శించిందీ లేదు. తెలంగాణవాదులుగా చెప్పుకునే సంజయ్, కిషన్రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్రావు వంటి వాళ్లు కూడా నోరెత్తలేదు. దీంతో బీజేపీ నేతలు.. తమ కూటమి మిత్రుడికి సహకారం అందించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి కాంగ్రెస్ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. ప్రాజెక్టుకు పర్మిషన్ఇవ్వొద్దని కేంద్రానికి తేల్చి చెప్పింది. సెంట్రల్ వాటర్కమిషన్, గోదావరి రివర్మేనేజ్మెంట్ బోర్డులకూ లేఖలు రాసింది. కేంద్ర జలశక్తి మంత్రికీ విజ్ఞప్తులు చేసింది.
నీటి వాటాలపైనా పోరాడట్లే..
కృష్ణా జలాల్లో ఏపీ మొదట్నుంచీ అవే కుట్రలకు పాల్పడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్స్టోరేజ్నుంచి కూడా నీటిని తన్నుకుపోతున్నది. ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కుడి కాల్వ నుంచి విచ్చలవిడిగా నీటిని తోడేస్తున్నది. ఈ ఏడాదైతే ఆ దోపిడీని పీక్స్కు తీసుకెళ్లింది. 716 టీఎంసీలను దోచుకుపోయింది. వాస్తవానికి బచావత్అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా.. అందులో కేసీఆర్హయాంలో 66:34 నిష్పత్తిలో నీటిని పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు వచ్చేలా కుట్రపూరితమైన ఒప్పందాన్ని కేసీఆర్హయాంలో చేసుకున్నారు.
దీంతో ఏపీ జలదోపిడీకి హద్దులు లేకుండా పోయాయి. ఒప్పందం జరిగినప్పటి నుంచి తెలంగాణకు గండి కొడుతూ ఏపీ కోటాకు మించి నీటిని తీసుకెళ్లిందే తప్ప.. తక్కువ తీసుకెళ్లలేదు. ఈ అన్యాయాన్ని సవరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. 70 శాతం (555 టీఎంసీల) నీళ్ల కోసం పట్టుబడుతున్నది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దీనిపై మారు మాట కూడా మాట్లాడడం లేదు.
కృష్ణా బోర్డు కూడా ఏపీకే అనుకూలంగా వ్యవహరిస్తున్నా.. బోర్డు తీరుపై తమ హైకమాండ్కు బీజేపీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. నీటి వాటాలు పెంచేందుకు కేంద్రంలోని తమ ప్రభుత్వానికి కనీసం రిప్రజంటేషన్ఇచ్చిన పాపాన పోలేదు. వాస్తవానికి ఇప్పుడే కాదు.. 2014 నుంచి బీజేపీది ఇదే తీరు. కాగా, న్యాయమైన నీటి వాటాల కోసం కాంగ్రెస్ప్రభుత్వం మంచి లాయర్లను పెట్టి తీవ్రంగా పోరాడుతున్నది. కొద్ది నెలల క్రితమే సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్కుషీ వోహ్రానూ లీగల్టీంలో చేర్చుకున్నది. ప్రభుత్వం చేసిన కృషితోనే తొలుత రెండు రాష్ట్రాల వాటాలను తేల్చే సెక్షన్ 3పై వాదనలు వింటామని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు దాని మీదే వాదనలు జరుగుతున్నాయి.
మీటింగ్ ఎజెండా నుంచి పోలవరం అంశం తొలగింపు..
ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రగతి మీటింగ్నిర్వహించారు. అందులో పోలవరం ప్రాజెక్ట్నిర్మాణం, ముంపు, ఆర్థిక అవసరాలు తదితరాలపై చర్చనే ప్రధాన ఎజెండాగా పెట్టారు. కానీ, సమావేశానికి రెండు రోజుల ముందు ఆ ప్రధానాంశాన్నే ఎజెండా నుంచి ఎత్తేశారు. కూటమి ప్రభుత్వం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పి దానిని తొలగించారన్న ఆరోపణలూ ఉన్నాయి. పోలవరంపై తెలంగాణ సర్కార్ ముందు నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నది.
ప్రాజెక్టు బ్యాక్వాటర్తో తెలంగాణలోని ఆరు ప్రధాన వాగులు, గోదావరి క్రాస్సెక్షన్లు, 36 వాగుల డ్రైనేజీ వ్యవస్థలపై భారం పడుతుందని, భద్రాచలం టౌన్కు ముంపు ముప్పు పెరుగుతుందని చెబుతున్నది. మొత్తంగా 965 ఎకరాలు ముంపునకు గురవుతుందని తెలిపింది. కానీ, ఏపీ మాత్రం దీనిపై అడ్డంగా వాదిస్తున్నది. ముంపే ఉండదని చెబుతున్నది. దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం నోరెత్తడం లేదు. అసలు ప్రగతి మీటింగ్నుంచి పోలవరం అంశాన్ని ఎత్తేయడంపైనా ఒక్క మాట మాట్లాడలేదు.
రాయలసీమ, శ్రీశైలం పనులపైనా మౌనం..
కృష్ణా జలాల్లో జలదోపిడీని మరింత పీక్స్కు తీసుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ప్రాజెక్టును చేపడుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు సైట్లో పనులు కూడా చేసింది. అయితే ఆ పనులను ఆపేసి, ప్రాజెక్టు సైట్ను పూర్వస్థితికి తీసుకురావాలని పర్యావరణ శాఖ ఆదేశించింది. అయినప్పటికీ ఏపీ మాత్రం స్పందించడం లేదు. దీనిపై ఇటీవల పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరోవైపు లక్షన్నర క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలానికి భారీ గండిపెట్టిన ఏపీ.. ఆ నీటిని తరలించే శ్రీశైలం రైట్మెయిన్కెనాల్కెపాసిటీని పెంచేందుకు లైనింగ్ పనులనూ మళ్లీ మొదలుపెట్టింది.
తద్వారా 90 వేల క్యూసెక్కులను తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నది. దీనిపైనా కృష్ణా బోర్డుకు రాష్ట్ర సర్కార్ ఫిర్యాదు చేసింది. కానీ, రాష్ట్ర బీజేపీ మాత్రం.. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేయలేదు. ఏపీని అడ్డుకునేలా చర్యలు తీసుకోలేదు. దీనిపై మాట కూడా మాట్లాడడం లేదు.