
- హైదరాబాద్ పాతబస్తీ నల్ల పోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు
అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారికి హైదరాబాద్ పాతబస్తీలోని నల్ల పోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వెండి బోనం సమర్పించారు. 500 మంది మహిళలు జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు, వెండి బోనం, 50 బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలంపూర్ పట్టణంలో డప్పు వాయిద్యాలు, వివిధ కళారూపాలతో బోనాలు ఎత్తుకొని వాసవి సత్రం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
వారికి ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పించేవాళ్లమని నల్ల పోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది జోగులాంబ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామని, ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని చెప్పారు.