హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు అయ్యింది. 2026, మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 20న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
సోమవారం (ఫిబ్రవరి 23) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రి మండలి సుధీర్ఘంగా చర్చించింది. అనంతరం 2026, మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రి మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది.
కేబినెట్ భేటీ నిర్ణయాలు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP) ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు.
అలాగే.. హైదరాబాద్ మెట్రోను L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలను కేటాయించింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపింది. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
