హైదరాబాద్, వెలుగు: అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో చేర్చడంతోపాటు అనర్హుల పేర్లను తొలగించేలా త్వరలో చేపట్టనున్న సర్ ప్రక్రియను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించాలని ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో), ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్ ప్రక్రియలోని చట్టపరమైన నిబంధనలు, ఐటీ సంబంధిత కార్యకలాపాలపై నిపుణులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, డిప్యూటీ సీఈవోలు, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
