![కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు](https://static.v6velugu.com/uploads/2023/02/KRMB_YB1hMyO0Sb.jpg)
హైదరాబాద్, వెలుగు : గాలేరు –నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఆపాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ లెటర్ రాశారు. జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ, వేమికొండ, సర్వరాయ సాగర్ రిజర్వాయర్ల విస్తరణకు ఏపీ వాటర్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి బేసిన్ అవతలికి తరలిస్తున్నారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 44 వేల క్యూసెక్కులకు పెంచిందని.. మళ్లీ ఇప్పుడు దానికి 88 వేల క్యూసెక్కులకు పెంచే ప్రయత్నాల్లో ఉందని తెలిపారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గాలేరు, నగరికి 22 వేల క్యూసెక్కులు అదనంగా తరలించేందుకు కొత్త రెగ్యులేటర్ నిర్మాణానికి పూనుకుందని లేఖలో వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ 1), ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ను అతిక్రమించి ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపి వేయించాలని విజ్ఞప్తి చేశారు.
పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తలేరు : కేంద్రం
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించినట్లు కేంద్రం లోక్సభలో తెలిపింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు గురువారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిశ్చార్జ్ కెపాసిటీ ఇప్పటి వరకు 44 వేల క్యూసెక్కులుగా ఉందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల విస్తరణ పనులు చేపట్టినా.. పార్లమెంట్కు మాత్రం నిజాలు చెప్పడం లేదని తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్లు పేర్కొన్నారు.