- ప్రయాణ అంతరాయాలు, భద్రతా సమస్యలపై వాకబు
న్యూఢిల్లీ, వెలుగు: మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 24x7 కంట్రోల్ రూమ్కు భారీగా కాల్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి సుమారు 200 మందికిపైగా పౌరులు తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రయాణ ఆటంకాలపై అధికారులను సంప్రదించినట్టు తెలంగాణ భవన్ అధికారులు వెల్లడించారు. మిడిల్ఈస్ట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఆందోళన చెందుతున్న తెలంగాణ పౌరుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక విభాగం ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, క్షేత్రస్థాయిలో బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నది. రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయెల్ స్వయంగా కంట్రోల్ రూమ్ పనితీరును పర్యవేక్షిస్తున్నారు.
