
తెలంగాణ మరో రికార్డు సాధించింది. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశం ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు 19 లక్షల కొత్త ఓటర్లు చేరారు. 2018 నాటికి 2.8 కోట్లు ఓటర్లు ఉండగా..2023 జనవరి నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2.99 కోట్లకు చేరినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మరో నాలుగైదు నెలల్లో ఓటర్ల సంఖ్య మరింత పెరిగి.. 3 కోట్లు దాటుతుందని అంచనా వేసింది.
2018 నుంచి జనవరి 2023 వరకు మహిళ ఓటర్లు, యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం ఓటర్లలో 71 శాతం అంటే దాదాపుగా 2.12 కోట్ల మంది మహిళలు, యువత ఉన్నారని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షల ఓటర్లు 18, 19 ఏళ్ల వయసు వారే ఉండటం విశేషం. 2023 జనవరిలో 6.84 లక్షల మందిని కొత్త ఓటర్లు చేరగా, పాత ఓటర్లలో 2.72 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.... రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లి (6,44,072 ఓటర్లు) నియోజకవర్గంలో ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు భద్రాచలం (1,42,813) నియోజకవర్గంలో ఉన్నారు.
2023 జనవరి వరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 99 లక్షల 77 వేల 6 వందల 59 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు కోటి 50 లక్షల 50 వేల 4 వందల 64 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కోటి 49 లక్షల 25 వేల 243 మంది ఉన్నారు. యువకుల ఓటర్లు 64 లక్షల 89 వేల 502 కాగా.. అమ్మాయిల ఓటర్లు 63 లక్షల 93 వేల 703గా ఉన్నాయి. 1 8 నుంచి 39 ఏళ్ల వయసున్న వారు కోటి 28 లక్షల 83 వేల 205 మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఓటర్ల జాబితాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వీటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 4 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.