ఇండియా టాప్ 25 IPSలలో డీజీపీ మహేందర్ రెడ్డి

ఇండియా టాప్ 25 IPSలలో డీజీపీ మహేందర్ రెడ్డి

ఇండియాలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల లిస్ట్ లో రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. ఫేమ్ ఇండియా, పీఎస్ యూ వాచ్, ఆసియా పోస్ట్ మూడు సంస్థలు దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభకనబరుస్తున్న ఐపీఎస్ లపై సర్వే చేశాయి. ఏజెన్సీ, మీడియా నివేదికల ఆధారంగా టాప్ 25 మందిని ఎంపిక చేశారు. మంగళవారం సర్వే వివరాలను ప్రకటించారు. నక్సలిజం, టెర్రరిజం, మాదకద్రవ్యాలు, మానవ అక్రమరవాణ వంటి అంతర్జాతీయ నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. నేరాలను నియంత్రించే సామర్థ్యం, నిజాయితీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పీఎస్ యూ వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శుక్లా తెలిపారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌‌‌‌కు చెందిన ఎం.మహేందర్రెడ్డిని నవంబర్ 12, 2017న రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మహేందర్రెడ్డి గోదావరిఖని అసిస్టెంట్ ఎస్పీగా పని చేశారు. తరువాత నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించారు. టాప్ 25 ఐపీఎస్ అధికారుల్లో ఆయన సెలెక్ట్ అయినందుకు డీజీపీ మహేందర్ రెడ్డిని ఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ స్వాతి లక్రా అభినందించారు.