ఇయ్యాల్టి( మే3) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు

ఇయ్యాల్టి( మే3) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు
  • మే10 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు, 29న సీట్ల అలాట్​మెంట్
  • జూన్ 30 నుంచి క్లాసులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్​ లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్  రిలీజైంది. డిగ్రీ ఫస్టియర్​లో 2025–26 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లను మూడు విడతల్లో చేపట్టనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుండగా, మే 29న సీట్ల అలాట్​మెంట్​చేయనున్నారు. కాగా, జూన్ 30 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు మొదలుకానున్నాయి. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో దోస్త్ –2025 కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కౌన్సిల్​లో దోస్త్  నోటిఫికేషన్, షెడ్యూల్​ను టీజీసీహెచ్​ఈ  చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన రిలీజ్ చేశారు. స్టేట్​లోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్​డబ్ల్యూ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ– ఫార్మసీ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. 

రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 908ఉండగా, వాటిలో 3,93,467 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు 79 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో 23,654 సీట్లున్నాయి. అయితే రెసిడెన్షియల్ కాలేజీల్లో ఆయా సొసైటీలే ప్రవేశాలు నిర్వహిస్తుంటాయి. కాగా, ఈ నెల 3 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, 10 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానున్నది. 29న సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు ఫీజు రూ.200 ఉండగా, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400 ఉంటుందని అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్  మహమూద్, కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, కళాశాల విద్యాశాఖ 
అధికారులు పాల్గొన్నారు. 

40 హెల్ప్ లైన్ సెంటర్లు

డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో విద్యార్థులకు సహాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆధార్ వివరాల్లో పొరపాట్లు, అప్​లోడ్ చేసిన సర్టిఫికేట్లలో ఏమైనా లోపాలుంటే వాటికి ఆయా సెంటర్లలో పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా హెల్ప్ లైన్ సెంటర్లు 33, వర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లు ఆరు, రాష్ట్ర స్థాయి సెంటర్ ఒకటి ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు దోస్త్ వెబ్ సైట్ https://dost.cgg.gov.in ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్టూడెంట్ మొబైల్ నంబర్ కు ఆధార్ లింక్ చేసి ఉంటే, నేరుగా తమ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ద్వారా దోస్త్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు.