
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ భద్రతపై వినియోగదారులకు అవగాహన అవసరమని తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు సెక్రటరీ టి. కాంతారావు తెలిపారు. జూన్ 26న ఎలక్ట్రికల్ సేఫ్టీ డే సందర్భంగా తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులు తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యతలు, భద్రతా ప్రమాణాలపై ఆయన కీలక సూచనలు జారీ చేశారు. ఇండ్లు, భవనాల్లో విద్యుత్ , అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
‘‘ప్రతి ఇల్లు, భవనంలో ఐఎస్: 3043 ప్రమాణాల ప్రకారం కనీసం ఒక ఎర్త్ పిట్ ను నిర్మించాలి. సాధ్యమైతే రెండు ఏర్పాటు చేయాలి. లైట్నింగ్ కండక్టర్ కు సెపరేట్ ఎర్త్ పిట్ తప్పనిసరి. విద్యుత్ సరఫరాకు సరైన కేబుల్ సైజులు ఉపయోగించాలి. లోడ్, ఫాల్ట్ కరెంట్, వోల్టేజ్ డ్రాప్ లను దృష్టిలో ఉంచుకోవాలి”అని పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ విభాగం, నిరంతరం కృషి చేస్తోందని కాంతారావు వివరించారు.