శ్రీశైలం ప్రాజెక్ట్గొయ్యిని పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? : తెలంగాణ ఫార్మర్స్ ఫెడరేషన్

శ్రీశైలం ప్రాజెక్ట్గొయ్యిని పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? : తెలంగాణ ఫార్మర్స్ ఫెడరేషన్
  • కేఆర్ఎంబీకి తెలంగాణ ఫార్మర్స్ ఫెడరేషన్ లీగల్ నోటీసులు 

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం డ్యామ్ ప్లంజ్​పూల్​లో ఏర్పడిన భారీ గొయ్యితో ప్రమాదం పొంచి ఉన్నా కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పట్టించుకోవడం లేదని తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజురోజుకూ గొయ్యి పెరిగి డ్యామ్​ ఫౌండేషన్​పై ప్రభావం పడుతున్నా.. చూసీ చూడనట్టు వదిలేస్తున్నదని మండిపడింది. సమయానికి మెయింటెనెన్స్ చేయడం లేదని, డ్యామ్​పై నిర్లక్ష్యం వ్యవస్థీకృతమైందని తెలిపింది. వెంటనే డ్యామ్​కు రిపేర్లు చేయించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ విజయ్​పాల్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధుల నిర్వహణలోనూ కృష్ణా బోర్డు విఫలమైందని, శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్​ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత నెలలోనే శ్రీశైలం డ్యామ్​కు పొంచి ఉన్న ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసినా ఏమీ పట్టనట్టున్నదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏదైనా డ్యామేజ్ జరిగితే దక్షిణ తెలంగాణకు భారీ నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.   దాంతో పాటు నాగార్జునసాగర్, డిండి, మూసీ వంటి ప్రాజెక్టులకూ రెగ్యులర్​గా మెయింటెనెన్స్ చేయాలని కోరారు.