తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాసేపట్లో పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ అందించనున్నారు సీఎం. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరుల స్తూపం దగ్గర పుష్ఫ గుచ్చంతో నివాళి అర్పించారు. సీఎంతో పాటు పలువురు నేతలు నివాళి అర్పించారు.
ప్రజలకు రేవంత్ విషెస్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
