షాబాద్లో ఆరు హత్యలు చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్కుమార్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. రాజ్కుమార్ మరణంపై ఆయన సోదరుడు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్కుమార్ మృతిపై కొత్తూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజ్కుమార్ సోదరుడు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, తన తమ్ముడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని భాస్కర్ తన పిటిషన్లో స్పష్టం చేయడం గమనార్హం.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజ్కుమార్ సోదరుడు భాస్కర్ పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. రాజ్కుమార్ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి భారీగా అప్పులపాలయ్యాడని తెలిపారు. ఆ అప్పుల బాధ తట్టుకోలేక గతంలో, అంటే అక్టోబర్ 2025 లోనూ రాజ్కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వివరించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో మళ్లీ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భాస్కర్ పేర్కొన్నారు.
ALSO READ : దెయ్యంలా తిరిగొస్తా
గతంలో నమోదైన ఒక పోక్సో (POCSO) కేసు తర్వాత రాజ్కుమార్ ప్రవర్తనలో తీవ్ర మార్పులు వచ్చాయని, మానసికంగా వింతగా ప్రవర్తించేవాడని సోదరుడు తెలిపాడు. ఇక షాబాద్లో ఆరు దారుణ హత్యలు చేసిన తర్వాత రాజ్కుమార్ తన తండ్రికి ఫోన్ చేశాడనే విషయాన్ని భాస్కర్ బయటపెట్టాడు. నేను ఆరు హత్యలు చేశాను.. మీరు కూడా ఇంట్లో నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోండి" అని తండ్రికి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొత్తూరు పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
