దెయ్యంలా తిరిగొస్తా: దీక్ష విరమణపై సోనమ్ వాంగ్ చుక్ కీలక ప్రకటన

దెయ్యంలా తిరిగొస్తా: దీక్ష విరమణపై సోనమ్ వాంగ్ చుక్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‎కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ పర్యావరణ వేత, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారానికి (జులై 17) ఆయన దీక్ష 20వ రోజుకు చేరుకుంది. 20 రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. 

మరో రెండు రోజులు ఇలాగే ఉంటే ఆయన చనిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దీక్ష విరమణపై వాంగ్ చుక్ కీలక ప్రకటన చేశారు. జులై 20న చలో పార్లమెంట్‎ కార్యక్రమంలో పాల్గొనే వరకు తన దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ జులై 20న పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనే వరకు తాను ప్రాణాలతోనే ఉంటానని పేర్కొన్నారు. ఒకవేళ చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం కాకపోతే దెయ్యంలా తిరిగి వస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘మీ అందరితో కలిసి పార్లమెంటుకు పాదయాత్ర చేసేందుకు నేను జూలై 20 వరకు ఎలాగైనా ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ జూలై 20న మన పాదయాత్ర విజయవంతం కాకపోతే అప్పుడు నేను దెయ్యంగా తిరిగి వస్తాను’’ అని వ్యాఖ్యానించారు. నేను బయటకు బలహీనంగా కనిపించినా.. మానసికంగా చాలా బలంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. జూలై 20న మనమంతా కలిసి వెళ్లి ప్రజాస్వామ్య దేవాలయంలో మన విన్నపాన్ని ప్రభుత్వానికి సమర్పిద్దామని పిలుపునిచ్చారు. సీజేపీ చలో పార్లమెంట్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని తన మద్దతుదారులకు సూచించారు.