
- ఎక్స్గ్రేషియా కోసం 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలి
- గైడ్ లైన్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అర్హుల ఎంపిక కోసం విధివిధానాలను ఖరారు చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులిచ్చారు. బాధిత కుటుంబాలు జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే, కార్మికుడు చనిపోయిన 6 నెలల్లోపు అప్లయ్ చేసుకోవాలని పేర్కొన్నారు. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకు వెళ్లి.. అక్కడే ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ కార్మికులకు ఇది వర్తించనుంది.
అర్హత ప్రమాణాలు
మరణించిన గల్ఫ్ ఉద్యోగి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులను ప్రాధాన్యతా క్రమంలో (తెలంగాణకు చెందినవారు) ఈ ప్రయోజనం కోసం కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. కారణంతో సంబంధం లేకుండా 07.12.2023న లేదా ఆ తర్వాత.. ఏడు గల్ఫ్ దేశాలలో ఏదో ఒకదానిలో మరణించినవారికి పరిహారం వర్తించనుంది.
దరఖాస్తు ప్రక్రియ: గల్ఫ్లో కార్మికుడు మరణించిన లేదా మృతదేహాన్ని స్వీకరించిన తేదీ నుంచి 6 నెలలలోపు అతడి కుటుంబ సభ్యుడు అవసరమైన పత్రాలతో దరఖాస్తును సంబంధిత జిల్లా కలెక్టర్కు సమర్పించాలి. సమర్పించిన డాక్యుమెంటేషన్ ఆధారంగా దరఖాస్తును పరిశీలించడానికి, అర్హతను ధృవీకరించడానికి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేస్తారు. ఆపై జిల్లా కలెక్టర్ అర్హతగల కుటుంబ సభ్యునికి చెల్లింపు కోసం ప్రొసీడింగ్స్ రూపంలో పరిహారం మంజూరును వీలైనంత తొందరలో జారీ చేస్తారు. మంజూరైన మొత్తం రూ.5 లక్షలు అర్హత కలిగిన కుటుంబ సభ్యుల(ల) బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ అవుతాయి.
దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన పత్రాలు
- మరణించిన గల్ఫ్ ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం
- మరణించిన గల్ఫ్ ఉద్యోగికి చెందిన రద్దయిన పాస్పోర్టు
- గల్ఫ్లో మృతుడి ఉద్యోగానికి సంబంధించిన రుజువు(వర్క్ వీసీ, ఉపాధి ఒప్పందం)
- దరఖాస్తుదారుల చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా వివరాలు