డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 5 వేల 89 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 2 వేల 575 ఎస్జీటీ, ఒక వెయ్యి 739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయని చెప్పారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సెప్టెంబరు 15న నిర్వహిస్తామన్న మంత్రి సబిత.. అదే నెల 27న ఫలితాల వెల్లడించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇటీవలే కాంట్రాక్ట్ విధానంలో ఒక వెయ్యి264 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేశామని.. ప్రాజెక్టు అయినందున కాంట్రాక్ట్ విధానంలో నియమించామని చెప్పారు. అయితే.. కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని మంత్రి తేల్చి చెప్పారు. గురుకులాల్లో 12 వేల150 బోధన, బోధనేతర ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒప్పంద టీచర్ల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 567మంది ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తూ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.