
- రెండు నెలల్లోపు నివేదిక సిద్ధం చేయనున్న కమిటీ
- అటవీ భూములతోపాటు పోరంబోకు, రెవెన్యూ, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూముల రక్షణకూ ఉపయోగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ భూములను గుర్తించేందుకు ప్రభుత్వం ఎక్స్ పర్ట్ కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ, అటవీయేతర, ప్రభుత్వ భూములను గుర్తించనుంది. ఒకవేళ ప్రభుత్వ భూముల్లో చెట్లు, పొదలు ఉంటే డీమ్డ్ ఫారెస్టుగా పేర్కొననున్నది. కమిటీ ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. రెండు నెలల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలకు నివేదిక ఇవ్వాలని గడువు విధించగా.. ఆ దిశగా పని పూర్తి చేయడంపై కమిటీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ కమిటీ అందించే నివేదిక రాష్ట్రంలోని పోరంబోకు, రెవెన్యూ, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూములకు రక్షణ కవచంలా నిలుస్తుందని చెప్తున్నారు.
పీసీసీఎఫ్ ఆధ్వర్యంలో కమిటీ
దేశవ్యాప్తంగా అటవీ భూముల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇదివరకే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భూముల గుర్తింపు కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డాక్టర్ సి. సువర్ణ చైర్ పర్సన్ గా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీలో వైల్డ్ లైఫ్ఎక్స్ పర్ట్, రిటైర్డ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శంకరన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాధవరావు, ఖమ్మం జిల్లా అటవీ అధికారి, రాజన్న అటవీ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అటవీ భూములను గుర్తించి, వాటిని డాక్యుమెంట్ చేయనున్నది. ఈ కమిటీ త్వరలోనే భేటీ కానున్నది. అనంతరం రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించనున్నారు. అటవీ భూముల ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అటవీ భూములను రియల్ ఎస్టేట్, మైనింగ్, లేదా ఇతర కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీ నివేదిక ఉపయోగపడనుంది.
అటవీ లక్షణాలుంటే డీమ్డ్ ఫారెస్ట్..
అటవీ ప్రాంతంగా పరిగణించదగిన భూములు, అటవీ లక్షణాలు కలిగిన ప్రాంతం, అటవీ బయట ఉన్న భూములను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అలాంటి భూమి ఎవరి అధీనంలో ఉన్నా.. అటవీ భూముల జాబితాలో చేర్చాలని భావిస్తోంది. అధికారికంగా అడవులుగా వర్గీకరించని ప్రాంతాలతోపాటు అడవులుగా అర్హత ఉన్న భూములను గుర్తించి డాక్యుమెంట్ చేయనుంది. చట్టబద్ధంగా అటవీ ప్రాంతంగా ప్రకటించకపోయినా, వర్గీకరించకపోయినా అటవీ ప్రాంత లక్షణాలు ఉంటే కమిటీ ఫీల్డ్ సర్వే చేసి డీమ్డ్ ఫారెస్ట్ గా గుర్తించనున్నది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండి ఆ ప్రాంతంలో దట్టమైన చెట్లు, పొదలు పెరిగితే వాటిని కూడా ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మొక్కలు నాటి పెంచిన ప్రాంతాల్ని గుర్తించి అవి ప్రభుత్వ అధీనంలో ఉన్నాయో.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో కూడా గుర్తించనున్నారు.
రెండేండ్లలో 100 చ.కి.మీ. తగ్గిన అటవీ భూమి
రాష్ట్రంలో మొత్తం 27,688 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఉందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు మొత్తం 24.69 శాతం ఉన్నట్టు ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే, ఇటీవల విడుదలైన ఫారెస్ట్ సర్వే రిపోర్ట్-2023 ప్రకారం రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గింది. రాష్ట్రంలో 2021=-23 మధ్య కాలంలో దాదాపు 100.42 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి తగ్గినట్టు సర్వే రిపోర్ట్ లో వెల్లడైంది.