583 మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

583 మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్  కాలేజీల్లో టీచింగ్  ఫ్యాకల్టీ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా 583 మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 231 మంది అసిస్టెంట్  ప్రొఫెసర్లను అసోసియేట్  ప్రొఫెసర్లుగా, 308 మంది అసోసియేట్  ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా, 44 మంది సీనియర్  ప్రొఫెసర్లను అడిషనల్  డైరెక్టర్  ఆఫ్  మెడికల్  ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) గా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 34 ప్రభుత్వ మెడికల్  కాలేజీలకు శాశ్వత ప్రిన్సిపాల్స్, అనుబంధ టీచింగ్  హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లు అందుబాటులోకి రానున్నారు.

రెండు రోజుల్లో ఈ ప్రొఫెసర్లందరికీ పోస్టింగ్  ప్రక్రియ పూర్తవుతుంది. మొదటిసారిగా ఐదు ఆప్షన్లతో పోస్టింగ్‌‌‌‌లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం చాలా కాలేజీలు తాత్కాలిక ఇన్‌‌‌‌చార్జులతో నడుస్తున్నాయి. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కాగా.. ఇటీవలే మెడికల్  అండ్  హెల్త్  సర్వీసెస్  రిక్రూట్‌‌‌‌మెంట్  బోర్డు 607 అసిస్టెంట్  ప్రొఫెసర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  జారీ చేసింది. అదనంగా 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది. ఇవి త్వరలో భర్తీ కానున్నాయి. 

మౌలిక సదుపాయాల కొరతపై ప్రభుత్వం దృష్టి

2021 నాటికి రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు ఉండగా.. 2022లో 8, 2023లో 9, 2024లో మరో 8 కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇచ్చారు. అయితే గత బీఆర్ఎస్  ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు లేకుండా అద్దె భవనాలు, గోడౌన్లను కాలేజీలుగా చూపించి ఎన్‌‌‌‌ఎంసీ అనుమతులు పొందింది. దీంతో ఫ్యాకల్టీ, సౌకర్యాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించేందుకు మెడికల్  కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, విద్యా సంసిద్ధత, విద్యార్థుల సంక్షేమం, ఆర్థిక, డిజిటల్  వ్యవస్థలను పరిశీలించి నివేదికలు సమర్పిస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా కాలేజీలు, హాస్పిటళ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.