హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్లో టెక్నాలజీని ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు 40 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందజేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 చొప్పున డ్రోన్లను ఇస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎఫ్పీఓలు, ప్రాథమిక సహకార సంఘాలకు 40 శాతం సబ్సిడీతో గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు.
డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం తగ్గుతుందని.. ఎరువులు, సూక్ష్మపోషకాలను పంటపై ఏకకాలంలో పిచికారీ చేయవచ్చని వివరించారు. దీంతో కూలీల ఖర్చు తగ్గి, రైతుల లాభాలు పెరుగుతాయన్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఆధునిక డ్రోన్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చి, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ప్రాధాన్యం ఇస్తూ యంత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, హార్టీకల్చక్ క్రాప్స్ అభివృద్ధికి పసుపు ఉడకపెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్, ఇతర కోత పరికరాలను సబ్సిడీ పథకంలో చేర్చిందని వెల్లడించారు. ఈ పథకం వివరాలు జిల్లా వ్యవసాయ ఆఫీసుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.2025---–26లో ఇప్పటివరకు మొత్తం 9,936 వ్యవసాయ యంత్రాలను రూ.28.74 కోట్ల సబ్సిడీతో రైతులకు అందచేశామని తెలిపారు. రానున్న 10- నుంచి 15 రోజుల్లో మిగిలిన యంత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
