ఎస్సీ, బీసీ గురుకులాల్లో సీటు కోసం సిఫార్సు లేఖల జోరు

ఎస్సీ, బీసీ గురుకులాల్లో సీటు కోసం  సిఫార్సు లేఖల జోరు
  • ప్రజాప్రతినిధుల లేఖలతో గురుకుల ఆఫీసులకు పేరెంట్స్
  • అడ్మిషన్స్ ఫుల్ అయ్యాయని బోర్డులు పెట్టిన ఆఫీసర్లు
  • ఇప్పటికే మూడు ఫేజుల్లో సీట్ల కేటాయింపు పూర్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకుల సంస్థల్లో సీట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు మసాబ్ ట్యాంక్‌‌లోని సొసైటీ హెడ్ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు. అయితే, ఎస్సీ, బీసీ గురుకులాల్లోని సీట్లు మొత్తం ఇప్పటికే ఫుల్ అయ్యాయని అధికారులు సొసైటీ హెడ్ ఆఫీస్ లకు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా, 5,6,7,8 క్లాసుల్లో, ఇంటర్ లో సీటు ఇవ్వాలని స్టుడెంట్లు తమ తల్లిదండ్రులతో వచ్చి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను కలుస్తున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా సీటు రాని విద్యార్థులు.. తమ జిల్లాలు, సమీప ప్రాంతాలు లేదా ప్రముఖ గురుకుల స్కూళ్లలో అడ్మిషన్ కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి సిఫార్సు లేఖలతో సొసైటీ హెడ్ ఆఫీసులకు వస్తున్నారు.

 ఎస్సీ, బీసీ గురుకులాల్లో  ఇప్పటికే 3 ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తికాగా.. మొదటి రెండు ఫేజ్ ల్లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ జాయినింగ్ రిపోర్ట్ చేసే తేదీ కూడా ముగిసిందని అధికారులు వెల్లడించారు. మూడో ఫేజ్ వచ్చే నెల ఒకటో తేదీకి ముగియనుందని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లుగా ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్ కు1 లక్షా 67 వేల మంది అప్లై చేసుకున్నారు. 5వ తరగతికే రికార్డు స్థాయిలో 88 వేల మంది అప్లై చేశారు.  మెరిట్, ర్యాంకు ప్రకారం.. అధికారులు సీట్లు కూడా కేటాయించారు. ఒక వేళ సీట్లు మిగిలితే వచ్చే నెలలో అప్లికేషన్లను పరిశీలించి వాటిని కూడా కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు.