కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డికి 6నెలల జైలు శిక్ష

కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డికి 6నెలల జైలు శిక్ష

కోర్టు ఆదేశాలను ధిక్కరించారన్న కేసులో.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష పడింది. కరీంనగర్ ఏసీపీ తిరుపతి, సీఐ శశిధర్ రెడ్డికి కూడా కమలాసన్ రెడ్డితో పాటే.. 6 నెలల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ.. రాష్ట్ర హైకోర్టు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సంచలన తీర్పు చెప్పారు.

ఇదీ నేపథ్యం

2015 నవంబర్ 2 నాటి కేసు ఇది. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని పుష్పాంజలి రిసార్ట్స్ లో పేకాట(రమ్మీ) ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసు హైకోర్టు దాకా వెళ్లింది. డివిజన్ బెంచ్ దీనిపై అప్పట్లోనే తీర్పు ఇచ్చింది. రిసార్టులో రమ్మీ ఆడుతున్నారని పోలీసులు చెబుతున్న ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని.. నిరంతరం రికార్డ్ అయ్యే దృశ్యాలను పోలీసులకు కోరినప్పుడు చూపించాలని సూచించింది. అందులో కొన్ని కెమెరాలను పోలీస్ స్టేషన్ తో అనుసంధానించాలని సూచించింది. రిసార్టులో నిఘా ఉంటుంది కనుక.. పోలీసులు పదే పదే తనిఖీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. జరిమానాలు విధించాల్సిన అవసరం లేదని.. సూచించింది కోర్టు. న్యాయస్థానం సూచనలతో తమ రిసార్టులో 35 కెమెరాలను అమర్చామని.. రిసార్ట్స్ ప్రతినిధి రవికిరణ్ రావు చెప్పారు. 2016 నవంబర్ నుంచి.. 2017 జులై మధ్య ఐదుసార్లు పోలీసులు రిసార్టులో తనిఖీలు చేశారని చెప్పారు. ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందంటూ ఓసారి.. బాంబు కాల్ వచ్చిందని మరోసారి.. సీసీ కెమెరా కనెక్షన్ కట్ అయిందని ఇంకోసారి.. దాడులు చేశారని చెప్పారు.

ఐదోసారి.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి రిసార్టుపై దాడులు చేశారని పోలీసులపై చర్యలు తీసుకోవాలని… హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, రిసార్ట్స్ యజమాని జగపతి రావు. ఈ పిటిషన్ ను విచారణ చేసిన జస్టిస్ పీవీ సంజయ్ కుమార్… కరీంనగర్ సీపీ సహా ముగ్గురికి జైలు శిక్ష విధించారు. పోలీసుల తీరుకు కూడా ఓ హద్దు ఉంటుందని.. అది హద్దుమీరిందని కోర్టు అభిప్రాయపడింది.  అప్పీల్ కు వెళ్లేందుకు 4 వారాల పాటు తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.