- ట్రాన్స్ జెండర్లకు పింఛన్లపై క్లారిటీ ఇవ్వండి
- వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నరో చెప్పండి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల వివరాలు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తీర్పులో సుప్రీం ఉత్తర్వుల అమలు, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన బోర్డు నివేదికను అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్ 17 ప్రకారం ఆసరా పింఛన్ను ట్రాన్స్జెండర్లకు వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక సంక్షేమ పథకం అమలుపై ఆలోచించాలని, దీనిపై ప్రభుత్వానికి సూచన చేయాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు చెప్పింది. కరోనా టైంలో ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ రేషన్, ఆ తర్వాత కూడా ఇవ్వాలని, సుప్రీం గైడ్లైన్స్ అమలు చేయాలంటూ వైజయంతి వసంత మోగ్లీ అలియాస్ ఎం.విజయ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ను బుధవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషన్ దాఖలు చేసే నాటికి రాష్ట్రంలో 57వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని అడ్వొకేట్ చెప్పారు. ఏజీ వాదిస్తూ, ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. విచారణను కోర్టు నవంబర్ 30కి వాయిదా వేసింది.
ఆటిజం బాధితులపై సుమోటో పిల్
‘ఆటిజం’తో బాధపడే స్టూడెంట్లకు ప్రత్యేక బడి లేదం టూ ఇటీవల ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్గా మలిచింది. పేదలు ఆటిజం బాధిత పిల్లలను వదిలేసే పరిస్థితులు ఉన్నాయనే కథనాన్ని సుమోటో పిల్గా స్వీకరించింది. చీఫ్ సెక్రటరీ, ఇతర వెల్ఫేర్ ఆఫీసర్లను ప్రతివాదులుగా చేర్చింది.
కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చెయ్యండి
తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పదేండ్లుగా పని చేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2011 నుంచి బెనిఫిట్స్ వర్తింపజేయాలని ఉత్త ర్వులు జారీ చేసింది. డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జాంలో ప్రదీప్ జూనియర్ ఇంజనీర్/కాంట్రాక్ట్ మేనేజర్గా ఎంపికయ్యాడు. ప్రదీప్ను ఏడాది కోసం కాంట్రాక్ట్ విధానంపై ఎంపిక చేశారని, కానీ రిక్రూట్మెంట్ అంతా రెగ్యులర్ విధానంలోనే జరిగినందున సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలని అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది.