గ్రూప్ 1 పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : 11న ఎగ్జామ్

గ్రూప్ 1 పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : 11న ఎగ్జామ్

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో పరీక్ష ఎలా నిర్వహిస్తారంటూ కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు కొందరు. వీటిపై జూన్ 5వ తేదీన విచారించిన హైకోర్టు.. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అభ్యంతరం లేదని.. నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే లక్షా 20 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది హైకోర్టు

గ్రూప్ 1 పరీక్షను టీఎస్ పీఎస్సీ పరిధిలో నిర్వహించకూడదని పిటీషనర్లు వాదించారు. పేపర్ లీకేజీ దర్యాప్తు కొనసాగుతుందని.. ఏ కమిషన్ లో అయితే పేపర్లు లీక్ అయ్యాయో.. అదే కమిషన్.. విచారణ పూర్తి కాకుండానే గ్రూప్ 1 పరీక్ష ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రూప్ 1 పరీక్ష అని.. పారదర్శకత లేకపోతే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పిటీషనర్ల తరపు లాయర్లు వాదించారు. పేపర్లు లీక్ అయిన పరీక్షలను మళ్లీ నిర్వహించకుండా.. హడావిడిగా గ్రూప్ 1 ఎందుకు నిర్వహిస్తున్నారంటూ పిటీషనర్ల తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకూడదని వాదించారు. 

ఈ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు అని.. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని.. అందులో భయపడాల్సిన అవసరం లేదంటూ.. పిటీషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.