- సైబరాబాద్ సీపీని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మైనర్ బాలిక అదృశ్యానికి సంబంధించిన కేసులో తనను అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న 40 ఏండ్ల వ్యక్తి ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో తనపై పోలీసులు చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఆగస్టు 3 రాత్రి నుంచి 4 వరకు కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో నమోదైన సీసీటీవీ దృశ్యాలను భద్రపరచి కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు.
పిటిషనర్పై చట్టప్రకారం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన ప్రకారం.. తాను గతంలో పనిచేసిన యజమాని ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక అదృశ్యమైన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు తెలిపారు. బాలిక అదృశ్యానికి ముందు డబ్బుల కోసం ఆమెతో సుమారు 90 సెకన్లపాటు ఫోన్లో మాట్లాడానని, డబ్బులు ఇవ్వడానికి నిరాకరించానని పేర్కొన్నారు.
అయినప్పటికీ కేపీహెచ్బీ పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా తనను అదుపులోకి తీసుకుని, 24 గంటలకు పైగా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని తెలిపారు. దాడి చేయడంతోపాటు రసాయనాలతో కాల్చారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అక్రమ నిర్బంధం గురించి బయట చెబితే ఎన్డీపీఎస్, పోక్సో చట్టాల కింద తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరించారని చెప్పారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టు, ఫొటోలను కోర్టుకు సమర్పించినట్లు పేర్కొన్నారు. మాజీ ఇంటి యజమాని పోలీసులకు లంచం ఇచ్చి తనను కేసులో ఇరికించారని, దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు చిత్రహింసలు, ఉపాధి నష్టానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని పిటిషనర్ కోర్టును కోరారు.
