- 180 ఎజెండా అంశాలు ఆమోదం
- కామారెడ్డి మున్సిపల్ మీటింగ్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన
- ఖానాపూర్లో సమావేశం బహిష్కరణ
కరీంనగర్ టౌన్/కామారెడ్డి/ఖానాపూర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. శనివారం కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్లోని మీటింగ్ హాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొని 180 ఎజెండా అంశాలను ఆమోదించారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో విద్యుత్ బిల్లులను బల్దియానే భరిస్తుందనే అంశంపై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కౌన్సిలర్ల ప్రశ్నల వర్షం
కుక్కలు, పందులు, కోతుల బెడద, నగర పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి సమస్య, ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆధునికీకరణ, అధికారుల తీరు, పారిశుధ్య కార్మికుల కొరత, 22 ఏ భూముల పరిష్కారం, పండగల నిర్వాహణ తదితర అంశాలు, సమస్యలపై సభ్యులు అధికారులపై ప్రశ్నలు సంధించారు. మాజీ మేయర్లైన ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ రవీందర్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్ ను రాష్ట్రంలోనే ప్లాస్టిక్ రహిత, మోడల్ నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్దామన్నారు. సభ్యులు దృష్టికి తీసుకువచ్చిన కుక్కలు, కోతుల సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు.
అక్రమ కట్టడాలపై మండిపడ్డ కౌన్సిలర్లు
కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్సమావేశం రసాబాసగా మారింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన శనివారం కౌన్సిల్మీటింగ్జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్పోడియం ఎదుట బైఠాయించి ఆందోళనలకు దిగారు. నిబందనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండానే తమ వార్డుల్లో పనులు చేపడుతున్నారని మండిపడ్డారు. గతేడాది భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పనులపై నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమాణారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు నినాదాలు చేయగా సమావేశం రసాబాసగా మారింది. సమావేశంలో వైస్చైర్పర్సన్ కాసర్ల గోదావరి, అడిషనల్కలెక్టర్ గిరి, కమిషనర్ ముత్యాలు, అధికారులు పాల్గొన్నారు.
పాతవి పూర్తిచేయకుండానే కొత్తవా?
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ అంకం మౌనిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎజెండాలో చేర్చిన అంశాలతో పాటు బిల్లుల మంజూరు విషయంపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. గడిచిన సమావేశాలకు సంబంధించిన ఎజెండా అంశాలను పూర్తి చేయకుండానే మళ్లీ కొత్త అంశాలను పొందుపరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేసవిలో తన సొంత ఖర్చులతో పట్టణంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న చైర్ పర్సన్ ఇప్పుడు ఆ ఖర్చుల కింద రూ.98 వేలు మంజూరు చేయాలని కోరడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు అంశాలపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సుందర్ సింగ్ సమాధానాలు ఇచ్చారు. అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
