- గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా
నిజామాబాద్, వెలుగు: నక్సల్స్ మాదిరిగానే డ్రగ్స్ను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.
గతంలో నక్సల్స్ ఆయుధాలతో అధికారం చెలాయించారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఇలాగే భారత్ను నషా విముక్త్ చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అధికారులు, సమాజం కలిసి పని చేయాలన్నారు. డ్రగ్స్ దందాతో డబ్బులు సంపాదిస్తున్న దుర్మార్గులు మరో ఇంటిని ఆగం చేస్తున్నామనే సంగతి మరుస్తున్నారని తెలిపారు.
డ్రగ్స్ నిర్మూలన నినాదానికి పరిమితం కావొద్దని, ఎవరి పరిధిలో వారు పని చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజం కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తుందని తెలిపారు. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మేయర్ ఉమారాణి, ఎంపీ అర్వింద్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయిచైతన్య ఉన్నారు.
పసుపు మార్కెట్కు అంతర్జాతీయ గుర్తింపు తేవాలి
పసుపు మార్కెట్కు అంతర్జాతీయ గుర్తింపు తేవాలని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సూచించారు. నగరంలోని జాతీయ పసుపు బోర్డ్ ఆఫీస్ను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మార్కెట్ లింకేజీని ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా పసుపు సాగుతో దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, బోర్డు ఏర్పాటుతో రైతుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద పసుపు ఉత్పత్తిదారుగా చేసి ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులతో జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడేలా చూడాలన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు అందించి విలువ ఆధారిత ఉత్పత్తులు పోత్సహిస్తున్న బోర్డ్ను అభినందించారు.
రసాయన అవశేషాలు లేని పసుపు సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి, విదేశీ మార్కెట్ను శాసిస్తారని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సెక్రటరీ భవానీశ్రీ ఉన్నారు. అనంతరం 50వ జన్మదినం సందర్భంగా ఎంపీ అర్వింద్ ఫౌండేషన్ తరపున 58 మంది చిన్నారుల వైద్యానికి ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించారు.
